కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడిపించింది. కొత్త పరిశ్రమలను ఆకర్షించడంతోపాటు ఉన్న పరిశ్రమల విస్తరణకు ప్రోత్సాహకాలు అందించింది. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున కల్పించడానికి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. సమైక్య పాలనలో కాంగ్రెస్ సర్కారు ఇక్కడ డంపింగ్ యార్డ్ చేయడానికి యత్నించింది. కానీ.. కేసీఆర్ సర్కారు 1,857 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయగా ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. ఇప్పటి వరకు 150కి పైగా పరిశ్రమలు అందుబాటులోకి రాగా మరో 250 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. దాంతో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారికి భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్లు. ఇదిలాఉండగా, సమైక్య పాలనలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని రాచకొండ గుట్టల ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేసింది. కానీ.. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే ప్రాంతంలో ఉద్యోగాలు సృష్టించే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసింది. ఇప్పుడది ప్రపంచ స్థాయి గుర్తింపుతో కొలువుల కార్ఖానగా మారింది. మొత్తం 1,857 ఎకరాల్లో పార్కును విస్తరించగా.. ఇక్కడ కాలుష్యానికి ఇబ్బంది లేని పరిశ్రమలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. ఆసియాలోనే పెద్ద పారిశ్రామిక వాడ అయిన ఈ పార్కులో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. మొదటి దశలో కేసీఆర్ సర్కారు 547 ఎకరాల్లో 589 పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపు చేసింది. సింగిల్విండో విధానంలో అనుమతులు ఇచ్చి, పార్కులో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. పార్కులో ఇప్పటి దాకా 150కి పైగా పరిశ్రమలు ఏర్పాటై తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. మరో 250 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల ఒక్కరోజే అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 51 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.
పార్కులో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు అందేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో ఈ ప్రాంతంలోని ఇంజినీరింగ్, ఐటీఐ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్ తదితర కోర్సుల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. పార్కులో పూర్తిస్థాయి పరిశ్రమలు ఏర్పాటైతే 45వేల మందికి ప్రత్యేకంగా ఉద్యోగాలు దొరుకనున్నాయి. చౌటుప్పల్తోపాటు చిట్యాల, సంస్థాన్ నారాయణపురం, పోచంపల్లి, రామన్నపేట, నార్కట్పల్లి, బీబీనగర్ తదితర మండలాలకు చెందిన యువతకు ఉపాధి దొరుకనుంది.
పార్కులో పరిశ్రమలు నెలకొల్పుతుండటంతో ఉపాధికి కొదవ లేదు. దీంతో ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే దండు మల్కాపురంలో రోజుకు సుమారు ఐదు వేల మంది దాకా పని చేస్తున్నారు. మహిళలకు సైతం మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే వలసలు ఆగిపోనున్నాయి. సొంత ఇలాఖాలోనే, ఇంటి పట్టున ఉపాధి దొరుకుతుండటంతో అంతా ఇక్కడే ఉండి ఏంచక్కా ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు మరింత పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెద్ద ఎత్తున ధరలు పెరగ్గా.. పార్కు ఏర్పాటుతో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం భూమి కోట్లలో పలుకుతుండటం గమనార్హం.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 5ఎకరాల స్థలంలో సుమారు రూ.41కోట్లతో ఈ కేంద్రానికి 2021 జనవరి 22న శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలోనే యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సెంటర్ను రెండు బ్లాక్లుగా నిర్మించారు. మొదటి బ్లాక్లో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఆడిటోరియం, ఐలా, టిఫ్ కార్యాలయాలు, రెస్టారెంట్లు, బ్యాంకులను నిర్మించారు. రెండో బ్లాక్లో పార్కులో ఉత్పత్తి చేసిన పరిశ్రమల వస్తువులను ప్రదర్శించేందుకు ప్రత్యేక మార్కెట్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వివిధ విభాగాల నిపుణులకు కార్యాలయాలు, వసతి గదులు, ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేశారు.
దండు మల్కాపురం పార్కులో ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్, ఎర్త్ డ్రిల్లింగ్కు సంబంధించిన ఉత్పాదక యూనిట్, అట్టపెట్టెల తయారీ, బ్రిక్స్, పోల్స్ తదితర సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్, ఎలక్ట్రికల్ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. రూ.156 కోట్లతో టాయ్స్ పార్కు ఏర్పాటుకు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 106 ఎకరాల భూమిని కేటాయించగా.. దాన్ని 196 ప్లాట్లుగా విభజించి యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇది పూర్తయితే సుమారు 10వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో బొమ్మలు తయారైతే చైనా నుంచి దిగుమతులు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకనున్నది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మౌలిక సౌకర్యాలు కల్పించింది. దీంతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చేసిన విద్యార్థులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందనుంది.
– సోమనబోయిన కృష్ణకుమార్, ఉద్యోగి