తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని, మరోసారి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నార్కట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గుత్తా మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో ఎంతో ప్రమాదం ఉన్నదని, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
నార్కట్పల్లి, ఆగస్టు 29 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని, ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాండ్ర గ్రామంలో రూ.2.50 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు, రూ.8.5 లక్షలతో నార్కట్పల్లి నుంచి మాండ్ర వరకు బీటీ రోడ్డు, తిరుమలగిరిలో పంచాయతీ కార్యాలయానికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమిర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ చిరుమర్తి లింగయ్యకు బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థిగా సీటు కేటాయించి మొదటిసారి మాండ్ర గ్రామానికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు రెండువేల బైక్లతో ర్యాలీ నిర్వహించారు. డీజే, డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతోపాటు పటాకులు కాలుస్తూ ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులతో ప్రమాదం పొంచి ఉందని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ పని చేస్తున్నారని గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ 2014 కంటే ముందు ఏ ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఇతర రాష్ర్టాల వారు కాపీ కొడుతున్నారని అన్నారు. రాష్ట్ర సంపదను పెంచి అట్టడుగువారికి పంచి పెడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. సొంత లాభం కోసం గ్రామాల్లోకి వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గం అత్యధిక నిధులతో ఎంతో అభివృద్ధి చెందిందని, అందుకు మరోసారి ఎమ్మెల్యే చిరుమర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మండలంలో సబ్ మార్కెట్ యార్డు కల త్వరలోనే సాకారం కానున్నదని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి జగశ్రెడ్డి నేతృత్వంలో మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు ఎంతో మేలు చేస్తూ సీఎం కేసీఆర్ వారిని కంటికి రెప్ప లా కాపాడుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందస్తుగా ఆలోచించి ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాల్వ మరమ్మతు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. రూ.19కోట్లతో ఎర్ర కాల్వ నిర్మాణ పనులకు కూడా ప్రతిపాదనలు పంపామన్నారు.
బ్రాహ్మణ వెల్లెంలలో ఉదయ సము ద్రం పనులు పూర్తి కావడం సంతోషంగా ఉంద ని తెలిపారు. మీ ప్రాంత బిడ్డను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి, సర్పంచ్ దొండ సౌమ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్రెడ్డి, నల్లగొండ డీఈఈ కరుణాకర్రెడ్డి, ఏఈ అశోక్, సెక్రటరీ గ్రేడ్-2 ఏఎంసీ జానయ్య, సూపర్వైజర్ ప్రవీణ్కుమార్, వెంకన్న, సర్పంచ్లు, ఎంపీటసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.