టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరుగనున్న పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 187 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 43,681 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండనున్నది. హాల్ టికెట్పై ఫొటో ప్రింట్ రాని వారు పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాల్సి ఉంటుంది.
రామగిరి, సెప్టెంబర్ 14 : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43,681 మంది అభ్యర్థులు హాజరవుతుండగా.. 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. కాగా, ఆయా పరీక్ష కేంద్రాలకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, హాల్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లకు గురువారం ఆయా జిల్లాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఉత్తర్వులు అందజేసి పంపించారు.
నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1కు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 12,423 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పేపర్ -2 పరీక్షకు 49 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 11,399 మంది హాజరు కానున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ -1కు 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,397 మంది, పేపర్ -2కు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,664 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. భువనగిరి జిల్లాలో భవనగిరి పట్టణంలోనే పేపర్ -1కు, పేపర్-2కు 13 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1కు 2,976 మంది, పేపర్ -2కు 2,822 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
సూర్యాపేట జిల్లాలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ 8247809660ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిశీలకులు నర్సింహులు తెలిపారు.
పరీక్ష కేంద్రం అడ్రస్లో మార్పు : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాక్షి శ్రీజూనియర్ కళాశాల పరీక్ష సెంటర్ అడ్రస్ను హాల్ టికెట్లో 60 ఫీట్ల రోడ్డుగా తప్పుగా ముద్రించడం జరిగిందని జిల్లా పరిశీలకులు తెలిపారు. ఇది ఖమ్మం క్రాస్రోడ్డులో ఉంటుందని, అభ్యర్థులు గమనించాలని సూచించారు.