నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించి ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను సీజ్ చేయాలన్నారు.
గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలి
సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే
సూర్యాపేట సిటీ, మే 29 : నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించి ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను సీజ్ చేయాలన్నారు. నకిలీ విత్తనాలతో జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని సూచించారు. జిల్లాలో డీఎస్పీల ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ర్టానికి, దేశానికి వ్యవసాయమే ముఖ్య ఆధారమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటతో నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన, ఎరువుల డీలర్లపై ఉందన్నారు. విత్తన వ్యాపార డీలర్లు బాధ్యతతో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నివారణకు కట్టుబడి ఉన్నందున రైతులకు నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో మండల, సర్కిల్, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను గుర్తిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా ఆంధ్రా రాష్ర్టానికి సరిహద్దుగా ఉందని, కృష్ణ పట్టెలో నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ముందస్తు తనిఖీలు, రైతులు, డీలర్లకు అవగాహన కల్పించడం, సరిహద్దుల్లో పటిష్టమైన నిఘాతో నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. జిల్లాలో పత్తి, మిర్చి పండించే రైతులు ఎక్కువగా ఉన్నందున వారితో సమావేశాలు నిర్వహించి చైతన్యపర్చాలన్నారు.
గతంలో నకిలీ విత్తనాల కేసులతో సంబంధం ఉన్న వారిపై నిఘా పెట్టాలని సూచించారు. రైతులు, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ, పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు.
నకిలీ విత్తనాల గురించి అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్ మీనా, ఉద్యానవన అధికారి నాగయ్య, డీఎస్పీలు దరవి, శ్రీధర్రెడ్డి, టాస్క్ఫోర్స్ డీఎస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, సీఐలు, ఎస్ఐలు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.