యాదాద్రి భువనగిరి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. ఫలితంగా తాగునీటికి కటకట ఏర్పడుతున్నది. మిషన్ భగీరథ నీళ్లలో స్థానిక బోర్ల నీళ్లను కలిపి అందిస్తున్నారు. ఆది కూడా వారానికి రెండు సార్లు కూడా నల్లాలకు వదలడంలేదు. మున్సిపాలిటీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే వేసవిలో పరిస్థితి ఏందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావాసులకు వేసవిలో నీటి కష్టాలు తప్పేలా కనిపించడంలేదు. నిత్యావసరాల కోసం వాడుకునే తాగునీటికి అప్పుడే కొరత ఏర్పడింది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 549 ఆవాసాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ గ్రిడ్ నుంచి మిషన్ భగీరథ నుంచి నీరు సరఫరా అవుతున్నది. ఆయా గ్రామాల్లో ప్రజల కోసం రోజుకు 70ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. గతంలో సుమారుగా ఇదే స్థాయిలో నీర సరఫరా అయ్యేది.
కానీ ప్రస్తుతం 34 ఎంఎల్డీలు మాత్రమే జిల్లాకు వస్తున్నాయి. ఇక చౌటుప్పల్, నారాయణపురం, భూదాన్పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని 144 ఆవాసాలకు నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి జలాలను సరఫరా చేస్తున్నారు. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాల్లోని 76 ఆవాసాల్లో పానగల్ రిజర్వాయర్ నుంచి కృష్ణానీటిని అందిస్తున్నారు. ఇవి కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీంతో ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నీటి బాధలు షురూ అయ్యాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో తిప్పలు తప్పడం లేదు. సరిపడా నీళ్లు లేకపోకపోవడంతో మిషన్ భగీరథ నీళ్లలోనే స్థానిక బోరు నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. అది కూడా వారానికి రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. కాలనీల్లో ట్యాంకర్ల నుంచి పట్టుకొని డ్రమ్ముల్లో నింపుకొంటున్నారు.
ఇవి కనీస అవసరాలకు కూడా చాలకపోవడంతో ఎప్పుడో వచ్చే వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి పట్టణంలోని అన్ని వార్డులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న ప్రజలకు ట్రాక్లర్ల ద్వారా అందించే ట్యాంకర్ల నీళ్లే ఆధారం. అక్కడ రెండు వాటర్ ట్యాంక్లు ఉన్నప్పటికీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
ఇక కొన్ని గ్రామాల్లో నీళ్లు లేక బోరింగ్లు, వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. గ్రామాలు, తండాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఇక మిషన్ భగీరథ నీళ్లు సరిపడా అందకపోవడంతో జనం వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. వాటర్ ప్లాంట్లలో నీటిని కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వేసవి కావడంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు పంట పండుతున్నది.
ఇంకా వేసవి ఆరంభం కాలేదు. ఎండలు ముదరలేదు. కానీ అప్పుడే నీటి కష్టాలు షురూ అయ్యాయి. ముఖ్యంగా గ్రామాలు, తండాల్లో నీటి ఎద్దడి మొదలైంది. భగీరథ నీరు సరిపడా రాకపోవడంతోపాటు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నీటి మట్టం పడిపోవడంతో బోర్లలో కూడా జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం లేకపోలేదు.