రామగిరి/ హాలియా/ కట్టంగూర్/ కొండమల్లేపల్లి/ గుడిపల్లి/ పెద్దవూర, చౌటుప్పల్ మే 26 : ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగా వీచిన గాలివానతో నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల తీవ్ర నష్టం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు కనగల్, తిప్పర్తి, కట్టంగూర్, పెద్దవూర, అనుముల మండలాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నల్లగొండ మండలం చందనపల్లిలో దాసరి లలిత ఇంటి రేకులు ఎగిరిపడడంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసమ య్యాయి.
కట్టంగూర్లో పొడిచేటి పార్వతమ్మ, మునుకుంట్ల గ్రామంలో చెంబయ్య, వెంకన్న, సత్తయ్య ఇంటిపై కప్పు రేకులు గాలికి లేచిపోయాయి. నరేశ్, గోవర్ధన్ పశువుల కొట్టాలు కూలిపోయాయి. నల్లగొండ- కట్టంగూర్ రోడ్డులో పెద్ద సంఖ్యలో చెట్టు విరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నల్లగొండలోని పానగల్ ైప్లెఓవర్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దాంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు మండలాల్లో కరెంట్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఇక అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. హాలియాలో పిడుగుపాటుకు బొడ్డుపల్లి లింగయ్యకు చెందిన గంగిరెద్దు మృతి చెందింది. పెద్దవూర మండలం పులిచర్లలో పిడుగు పడి రెండు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గుడిపల్లి మండలంలోని నడిమిబావి గూడెంలో వడ్డెపల్లి భరత్రెడ్డి ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో పిడుగు పడడంతో పంగ ఏడుకొండల్కు చెందిన గడ్డివాము దగ్ధమైంది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. చేతికంది వచ్చిన కాయలు రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్తో పాటు పలుచోట్ల వర్షానికి ధాన్యం తడిసింది.