నల్లగొండ, అక్టోబర్ 2 : ‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుకొచ్చిన మహా మేధావి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఐటీ, ఇతర పరిశ్రమలు ముందు వరుసలో ఉండటానికి కారణం మంత్రి కేటీఆర్ చతరుతే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండలో ఫ్లోరోసిస్ను పెంచి పోషించిన వృద్ధ సింహాలు మళ్లీ వస్తున్నారని, వాళ్లను ప్రజలు ఇంకా నమ్ముతున్నట్లు భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ను అంతమొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ను కాదని మిమ్మలను ప్రజలు ఆహ్వానిస్తున్నారా? అని ప్రశ్నించారు.
నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కంటే గొప్పగా అభివృద్ధి చేశారని పిలుస్తున్నారా.. లేదంటే మరోసారి కరువు తీసుకొస్తారని పిలుస్తున్నారా? అని కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర్రెడ్డిలను ఉద్దేశించి ప్రశ్నించారు. 40 ఏండ్లలో మీరు చేసిన అభివృద్ధి, తొమ్మిదేండ్లలో తాము చేసినందుకు ప్రజలు ఆహ్వానిస్తున్నారా అన్నారు. నిజాం కాలం నాటి నల్లగొండ రోడ్లను సీఎం కేసీఆర్ సహకారంతో భూపాల్రెడ్డి వందల కోట్లు పెట్టి ఆధునీకరిస్తే ఆయనను కాదని ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్ధాలు ప్రజలకు తెలుసని, వారిని మరోసారి నల్లగొండ ప్రజలు నమ్మబోరని, ఉమ్మడి జిల్లాలో 12కు పన్నెండు మందిని మరోసారి దీవించి అసెంబ్లీకి పంపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏబీసీడీలు రాని, కంప్యూటర్ ఎటు నుంచి చూడాలో తెలియని కోమటిరెడ్డికి ఐటీ మంత్రి ఇస్తే ఐటీ హబ్ తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాల తెస్తామని చెప్పి తేలేకపోతే కంచర్ల భూపాల్రెడ్డి ఒకే ఏడాదిలో తీసుకొచ్చారని తెలిపారు. ఈ అభివృద్ధి పూర్తి కావాలంటే మరోసారి భూపాల్రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు.