ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎన్ని ప్రతి బంధకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ మాలల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో పండుగలా సాగింది. అందరినీ మంత్రి ఆత్మీయంగా పలుకరించి వారితో సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న మహనీయుడు అంబేద్కర్ అని, ఆయనను ఏ ఒక్కరికో పరిమితం చేయడం తగదని అన్నారు. సూర్యాపేటలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అంబేద్కర్ వికాస కేంద్రం అందరి కోసమని తెలిపారు.
– సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 23
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 23 : సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం దళితబంధు పథకమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభివర్ణించారు. ఈ పథకంతో ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టాలన్నదే ధ్యేయమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల రహిత సమాజ నిర్మాణానికి కలలు కన్న మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అందరివాడని ఏ ఒక్కరికో పరిమితం చేయడం తగదని పేర్కొన్నారు. అంబేద్కర్ భవనాలు అందరివని తాజాగా నాలుగు కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ వికాస కేంద్రం అందరి కోసమన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. చదువు జీవితాల్లో వెలుగు నింపుతుందని అందరికీ చదువన్నదే అంబేద్కర్ ఆశయమని పేర్కొన్నారు. ఆ ఆశయ సాధనలో భాగమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిదిన్నరేండ్లలో కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అక్షరం పొల్లు పోకుండా అక్షర రూపం ఇస్తున్న ఘనత ముమ్మాటికి సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
సహఫంక్తి భోజనం
మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనం అనంతరం మంత్రి జగదీశ్రెడ్డితో సహా నిర్వాహకులు, హాజరైన ప్రతినిధులు కలిసి సహపంక్తి భోజనాలు, ఆత్మీయ పలకరింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బొల్లెద్దు దశరథ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణాశ్రీనివాస్, నాయకులు తలమల్ల హుస్సేన్, మేక వెంకన్న, అనుములపురి రవిబాబు, ఎర్రమళ్ల రాములు, యశోద రవి, కల్లెపల్లి మహేశ్వరి, బలరాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.