భువనగిరి అర్బన్, జూన్ 23: పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈద్గా నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మాహుల్లాఖాన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి, వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు దశల వారీగా పలు సమస్యలు షరిష్కారం అవుతున్నాయన్నారు.
మిషన్ భగీరథ పథకంతో జిల్లాలో ఫ్లోరైడ్ బాధలు తీరాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిందన్నారు. 60ఏండ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్తోనే సాధ్యపడిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి దేశంలోనే నంబర్వన్గా నిలిపామన్నారు. పోలీస్ వ్యవస్థలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళాభ్యున్నతి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ వంటివి జరుగకుండా ప్రత్యేక కమిషనరేట్లు ఏర్పాటు చేసిందన్నారు. రంజాన్ పండుగకు ప్రభుత్వం తోఫాతో పాటు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలోనే ముస్లింలకు గుర్తింపు వచ్చిందన్నారు. గతంలో భువనగిరి ప్రాంతం ఏ విధంగా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉందనేది కండ్లకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. అంతకు ముందు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో హోంమంత్రిని ఘనంగా సన్మానించారు.
సర్వ మతాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రాష్ట్రంలోని సర్వ మతాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న భూములను పరిరక్షించాలని ప్రత్యేక జీఓ తెచ్చి వక్ఫ్ భూములను రక్షించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
ప్రభుత్వ అనుమతితో ఈద్గా ఏర్పాటుకు రూ.2కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భువనగిరి పట్టణంలో కబ్జాకు గురైన భూమిని కాపాడి మైనార్టీలకు కానుకగా అందించడంపై సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకి భువనగిరి మైనార్టీ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ నాయకులు అజీమ్, రహీం పాల్గొన్నారు.