సత్తుపల్లి టౌన్, ఆగస్టు 11: రీ సర్వే ద్వారా రైతుల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అదే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని ఖమ్మం కలెక్టర్ దివాకర అన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధి గంగారం, బేతుపల్లి, నారాయణపురం, రామగోవిందాపురం, ఎంవీ పాలెం, రామానగరం, పాకలగూడెం గ్రామాల్లో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి భూ రీ సర్వేను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బేతుపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు పది బృందాలతో 12 వేల ఎకరాలకు భూ సర్వే కొనసాగుతున్నదని, ఇప్పటివరకు 4 వేల ఎకరాల భూములను రీ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
గ్రామాల్లో కొందరు రైతులకు పట్టాదారుస్ పాస్ పుస్తకాలు లేకపోవడం, ఆన్లైన్ ప్రక్రియలో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి భూమిపై ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండడం వంటి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారని, అలాంటి లోపాలను రీ సర్వే ద్వారా సరిచేస్తామని పేర్కొన్నారు. భూ సర్వేకు నోటీసు ఇచ్చిన రైతులు తమ కుటుంబంలో భూ హక్కుదారులు, పట్టాపాస్ పుస్తకంలో భూమి ఉన్న వారు అందరూ స్వయంగా సర్వేకు వచ్చి పూర్తి వివరాలు తెలియచేసి సహకరించాలని కలెక్టర్ కోరారు. అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత వివరాలు పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసి, భూదార్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.