చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమలు చేయనున్నది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర టెక్స్టైల్స్, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. కొత్తగా తెలంగాణ చేనేత పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద నేత కార్మికులకు ఫ్రేమ్ మగ్గాలు పంపిణీ చేయనున్నారు. ప్రతి నెలా నేత కార్మికుడికి రూ. 3వేలు ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికీ ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు అందించనున్నారు. ఇక కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల కోసం రూ.25వేలు అందించనున్నారు. దీంతో జిల్లాలో సుమారు 11వేల మందికి లబ్ధి చేకూరనున్నది. అదే విధంగా భూదాన్ పోచంపల్లి మండలంలోని హ్యాండ్లూమ్ పార్కు అందుబాటులోకి వస్తే వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి దొరకనున్నది. ప్రభుత్వ వరాల జల్లుపై నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తమకు సరైన న్యాయం దక్కుతున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికిరుణపడి ఉంటాం
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో చేనేత కుటుంబాలకు భరోసా పెరిగింది. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత బీమా పథకాలు మా కుటుంబాల్లో వెలుగు నింపాయి. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 3వేలు ఇస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉంది. నేత కార్మికులకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– విడం సాయికుమార్, చేనేత కార్మికుడు, సంస్థాన్ నారాయణపురం
ఏటా రూ.25వేల వరకు వైద్య సేవలు
చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చింది. చేనేత కార్మికులతోపాటు అనుబంధ కార్మికులకు కంటి, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులకు ఆరోగ్య కార్డు ద్వారా చికిత్స అందించనున్నది. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు వైద్య సదుపాయం కల్పించనున్నది. ఇక కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల కోసం రూ.25 వేలు అందించనున్నది. మొదటలో ఇది రూ.5 వేలు ఉండగా, ఇప్పటి వరకు రూ.15 వేలు ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 వేలకు పెంచింది.
నేతన్న ఖాతాల్లో నెలకు రూ.3వేలు
నేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది. దీని కింద కార్మికులకు రసాయనాలు, నూలుపై 40 శాతం రాయితీ కల్పిస్తున్నది. అయితే కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో సబ్సిడీ పొందలేకపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపై మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికుడికి నెలకు రూ.3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నది. ఈ పథకం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్వయంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
హ్యాండ్లూమ్ పార్కుతో వేలాది మందికి ఉపాధి..
నేతన్న సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి నిదర్శనం హ్యాండ్లూమ్ పార్కు. భూదాన్పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామంలో దివాలా తీసిన చేనేత పార్కును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నాడు 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పార్కు దివాలా తీయడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వమే వేలంలో దక్కించుకుంది. ఈ పార్కు అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది చేనేత కార్మికులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడనున్నది. అంతేకాకుండా చేనేతకు పూర్వవైభవం రానున్నది.
కొత్తగా చేనేత మగ్గం పథకం..
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం కొత్తగా తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం నుంచి ఈ స్కీం అమల్లోకి వచ్చింది. దీని కింద నేతన్నలకు గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను పంపిణీ చేయనున్నది. దాంతో కార్మికుల అనారోగ్య సమస్యలు దూరం కానున్నాయి. అంతేకాకుండా శ్రమ తగ్గి నాణ్యమైన చేనేత వస్ర్తాల ఉత్పాదకత పెరుగనున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం 6,651 చేనేత మగ్గాలు, 2,165 మరమగ్గాలు ఉన్నాయి. మొత్తంగా 9,734 మంది చేనేత కార్మికులు, 943 మంది మరమగ్గాల కార్మికులు పనిచేస్తున్నారు.
ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు
నేత కార్మికుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూత, రూ.5 లక్షల చేనేత బీమాతోపాటు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. చేనేత రుణమాఫీ, నేత కార్మికులకు పింఛన్, బ్లాక్ లెవల్ క్లస్టర్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టింది. దాంతో రాష్ట్రంలో నేత కార్మికుల బతుకులు మారాయి. ఇతర రాష్ర్టాలకు వలసలు తగ్గడంతోపాటు ఆత్మహత్యలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాని పరిస్థితి నెలకొంది.
నేత కార్మికులకు భరోసాపై హర్షం
మోత్కూరు, ఆగస్టు 8 : చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత దినోత్సవం రోజును పలు పథకాలను ప్రకటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావుకు చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మార్కండేయ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొక్కుల సత్యనారాయణ మాట్లాడుతూ నేతన్నలకు చేయూత పథకాన్ని అందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు రుణపడి ఉంటామన్నారు. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో చేనేత కార్మికులకు భరోసా కలుగనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచం కన్నయ్య, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పోచం భిక్షపతి, కార్యదర్శి జిల్లా రవీందర్, ఎలగందుల సత్యనారాయణ, అమరేందర్ పాల్గొన్నారు.
నేతన్నల కుటుంబాల్లో వెలుగులు
ఉమ్మడి రాష్ట్రంలోదుర్భర పరిస్థితుల్లో ఉన్న నేతన్న కుటుంబాల్లో తెలంగాణ సర్కారు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వెలుగులు నింపుతున్నది. నేత కార్మికుల సంక్షేమ కోసం నిరంతరం తపిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. నాడు ఎన్నో ఇబ్బందులతో నేత కార్మికులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. నేడు స్వరాష్టంలో నేతన్నల బతుకులు పూర్తిగా మారిపోయాయి. రైతుబీమా తరహాలో నేతన్న బీమాతోపాటు నూలు, మగ్గాలకు ఆనేక రాయితీలు ఇస్తుండడం అభినందనీయం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు నేతన్న సంక్షేమం కోసం మరిన్ని వరాల జల్లులు కురిపించడం హర్షణీయం. నేత కార్మికులంతా సీఎం కేసీఆర్ వెన్నెంటే ఉంటాం.
-కటకం స్వామి, పద్మాశాలి సంఘం జిల్లా నాయకుడు, రఘునాథపురం, రాజాపేట
మంత్రి కేటీఆర్ హామీలు సంతోషాన్నిచ్చాయి
చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు నేత కార్మికులకు సంతోషాన్నిచ్చాయి. గతంలో కార్మికులకు ఆరోగ్యపరంగా లబ్ధి చేకూర్చే ఐసీఐసీఐ లాంబార్డ్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో మళ్లీ కార్మికులకు రూ.25 వేల వరకు లబ్ధిపొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం చేపట్టడం అభినందనీయం. అలాగే 40 శాతం నూలు సబ్సిడీలో దళారుల జోక్యాన్ని గుర్తించి నేరుగు కార్మికులకు 3వేల రూపాయలు అందిస్తామనడం, సొసైటీ సభ్యులు మృతి చెందితే వచ్చే 12,500లను 25 వేలకు పెంచడం, ఐదు లక్షల ఉచిత బీమా ఇస్తామనడం చేనేత కార్మికులకు భరోసానిచ్చింది.
-గోశిక ధనుంజయ్య, చేనేత పారిశ్రామిక వేత్త, చౌటుప్పల్
ఫ్రేమ్ మగ్గాలు నేతన్నకు ఎంతో ఉపయోగకరం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేనేత మగ్గం పథకం కార్మికులకు ఎంతో ఉపయోగకరం. ఈ పథకం కింద గుంట మగ్గాలు ఉన్న కార్మికులకు ఫ్రేమ్ మగ్గాలను తక్షణమే అందించాలని నిర్ణయించడం సంతోషకరమైన విషయం. ఫ్రేమ్ మగ్గాలతో చేనేత కార్మికులకు శ్రమతగ్గి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నాణ్యమైన వస్ర్తాల ఉత్పాదకత పెరుగుతుంది. చేనేత కార్మికుల ఇండ్లల్లో స్థలాభావ సమస్య తీరనున్నది. ఈ మగ్గాన్ని తేలికగా అనువైన చోటుకు తరలించుకోవచ్చు. నేత కార్మికులం ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-ఏలె రామచంద్రం, చేనేత కార్మికుడు, సిరిపురం, రామన్నపేట