దమ్మపేట రూరల్, జులై 25 : సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తమకు వద్దని పీసా గ్రామ సభల్లో శనివారం తీర్మానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, పార్కలగండి, బలరాజుగూడెం, అంకంపాలెం, ఆర్లపెంట గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో పీసా గ్రామ సభలు నిర్వహించారు. తామంతా పామాయిల్ సాగు చేసుకుంటున్నామని, పామాయిల్ పంటకు డ్రిప్ ద్వారా నీటి తడులు అందిస్తున్నామని తీర్మానాల్లో పేర్కొన్నారు. సీతారామా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉపయోగం లేదని తీర్మానాల్లో వివరించారు. భూగర్భ జలాల అభివృద్ధికి ఫీడర్, సర్ప్లస్ చానెల్స్ ద్వారా చెరువులను నింపాలని కోరారు. తీర్మాన ప్రతులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్, భద్రాచలం ఐటిడిఏ పిఓ లతో పాటు ఇతర పెద్దలకు వినతి పాత్రలతో కలిపి ఇస్తామని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్నా పీసా చట్టాన్ని గౌరవించి, తమ తీర్మలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కూరం అర్జున్ రావు, మోకాళ్ల గురుమూర్తి, కొమరం సుశీల, శ్రీను, సోడెం గంగరాజు పాల్గొన్నారు.