సికింద్రాబాద్ : ఉజ్జయినీ మహంకాళి ( Ujjaini Mahankali ) అమ్మవారి బోనాల ( Bonalu) జాతరకు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav) ఆదేశించారు. ఆగస్టు 2 న సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాలలో అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం, బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహణలో పోలీసులపాత్ర ప్రధానమైందని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని, అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
జాతర జరిగే ఆగస్టు 2 న, ఫలహారం బండ్ల ఊరేగింపు జరిగే 3వ తేదీ సాయంత్రం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సరైన వర్షాలు కురవడం లేదన్నారు. అమ్మవారి దీవెనలతో విస్తారంగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ ఏసీపీ శ్రీధర్, జోనల్ కమిషనర్ మంగ తాయారు, హెల్త్ ఆఫీసర్ వర్శిత, వివిధ శాఖల అధికారులు, డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ సభ్యులు, ఆలయ కమిటీ మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చీర పనుల ప్రారంభం

మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా అమ్మవారి కి సమర్పించనున్న చీర తయారీ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. చీర తయారు చేసే మగ్గానికి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు.