అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30లోగా ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు పంపాలని ఆదేశించింది. పీఓ, ఏపీఓ వివరాలను టీ-పోల్లో నమోదు చేయాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా అధికారులు సైతం స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. మూడు విడుతల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగనున్నాయి. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు, 7,340 వార్డులు ఉండగా ఎన్నికల నిర్వహణకు సుమారు 13,000 మంది సిబ్బంది అవసరమవుతారని అధికారులు చెబుతున్నారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు.
నీలగిరి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఆ హడావుడి, వేడి పూర్తిగా తగ్గిపోకముందే మరో ఎన్నికల యుద్ధం షురూ అయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అన్ని రకాల వివరాలు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పాల్గొనడానికి అవసరమైన సిబ్బంది వివరాలను ఈ నెల 30లోపు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ సోమవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 2019 జవవరిలో సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 1న వారి పదవీకాలం ముగుస్తుంది. టెర్మ్ పూర్తయ్యిన మూడు నెలల లోపే ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. దీంతో అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్షన్కు సన్నాహాలు మొదలు పెట్టారు.
పంచాయతీ ఎన్నికల కోసం కావాల్సిన అధికారులు, సిబ్బందిని స్థానిక సంస్థల కోసం వినియోగించే వెబ్సైట్ అయిన టీ పోల్లో సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున ఎన్నికల కోసం పని చేసిన పీఓలు, ఏపీఓలతో పాటు ఇతర సిబ్బంది వివరాలను ఈ నెల 31లోపు టీపోల్ సాఫ్ట్వేర్లో ఫీడ్ చేయనున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్డుకో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ స్టేషన్లో 200మందిలోపు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక పోలింగ్ ఆఫీసర్ను నియమించనున్నారు. 201 నుంచి 400 మంది ఓటర్లుంటే ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 ఓటర్లుంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉండనున్నారు. 650 కంటే ఎక్కువ ఓటర్లుంటే రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 844 పంచాయితీల ఎన్నికల కోసం జిల్లాలో సుమారు 13,000మంది సిబ్బంది అవసరం కానున్నారు. ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో పనిచేసిన సిబ్బంది.. మూడో దశలో కూడా విధుల్లో ఉంటారు.
సర్పంచ్ ఎన్నికలు పాత రిజర్వేషన్ ప్రకారమే జరగనున్నాయి. రిజర్వేషన్లు 10ఏండ్ల వరకు కొనసాగున్న నేపథ్యంలో ఈ సారి కూడా అదే అమల్లో ఉంటాయి. ఇక ఓటరు జాబితాలో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా రూపొందించారు. అయితే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల చేరికలు, పాత ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఉండనుంది.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చికిత్స అందించి సాయం అందించేలా విద్యాశాఖ భవిత సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటిల్లో మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ వైకల్యాన్ని తగ్గించేలా, ఆత్మసైర్థ్యం పెంచేలా తోడ్పడుతుంది. అదేవిధంగా ఐఈఆర్పీ (ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) శిక్షణ ఇస్తారు. వీరితోపాటు ఫిజియోథెరపీ నిపుణులు ప్రతి సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించి భరోసా నింపుతుండటంతో భవిత సెంటర్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ – సమగ్రశిక్ష ద్వారా తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భవిత సెంటర్స్కు చెందిన ఐఈఆర్పీలు ఇంటింటికీ తిరిగి దివ్యాంగ పిల్లలను గుర్తిస్తారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వైకల్యం కలిగిన పిల్లలను భవిత సెంటర్స్కు తరలిస్తారు. చిన్నారులకు వైద్య సేవలతోపాటు విద్యను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రతి సోమవారం నిపుణులైన ఫిజియోథెరపిస్టులతో వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపీ చేయిస్తారు. అంతేకాకుండా మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన పిల్లలకు ఐఈఆర్పీ, ఉపాధ్యాయులు శిక్షణ అందించి పూర్వ స్థితికి వచ్చేలా ఆత్మవిశ్వాసం కల్పిస్తూ భవితలో భరోసా అందిస్తున్నారు.
భవిత సెంటర్స్కు వచ్చే ప్రత్యేక అవసరాలు పిల్లలకు ప్రతి నెలా రూ.300 చొప్పున అలవెన్స్ను విద్యాశాఖ అందిస్తుంది. ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా చిన్నారుల అవసరాలకు అనుగుణంగా వైద్యుల సూచనతో మూడు చక్రాల సైకిళ్లు, రోలేటర్స్ ఉచితంగా అందిస్తారు. క్రమం తప్పకుండా భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సదరం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకుంటారు. ఉచిత బస్పాసులు, రైల్వే పాస్లు సైతం అందిస్తారు.
విద్యాశాఖ – సమగ్రశిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్స్కు తీసుకొచ్చే ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు భరోసా కల్పించేలా నిబంధనల మేరకు శిక్షణ అందిస్తున్నాం. డీఈఓ సూచనలు, ఆదేశాలను పాటిస్తూ ఐఈఆర్పీలు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలు, వాటి పరిధిలో పర్యవేక్షణ చేస్తూ వైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాలకు తీసుకొస్తారు. వారికి ఫిజియోథెరపిస్టులతో అవసరమైన శిక్షణ అందించి ఆత్మసైర్థ్యం కల్పిస్తున్నారు. వైకల్యాన్ని బట్టి సదరం సర్టిఫికెట్ కోసం పంపిస్తాం. మరోవైపు వైకల్యం ఉన్న పిల్లలకు బస్, రైల్ పాసులు ఇప్పిస్తున్నాం. వీరికి ప్రభుత్వం ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 52 భవిత కేంద్రాల్లో 50మంది ఐఈఆర్పీలు సేవలందిస్తున్నారు.
– వంగూరి వీరయ్య, కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్, సమగ్రశిక్ష – నల్లగొండ
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను నిత్యం సందర్శించి వారిలో నైపుణ్యాలు పెంచి ఆత్మసైర్థ్యం పెంపొందేలా కృషి చేస్తున్నాం. దివ్యాంగ బాల, బాలికలకు మేలైన సేవలందిస్తూ విద్యాశాఖ లక్ష్యాన్ని చేరేలా పనిచేస్తున్నాం. భవిత కేంద్రాలకు రాని పిల్లల ఇంటికి ప్రతి శనివారం వెళ్లి సేవలందిస్తూ తల్లిదండ్రులు, పిల్లల్లో భరోసా కల్పిస్తున్నాం. భవిత సెంటర్లకు వచ్చే పిల్లలకు ఫిజియోథెరపిస్ట్లు శిక్షణ ఇచ్చి ప్రాక్టీస్ చేసేలా చూపిస్తున్నారు. దాంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మానసిక ధైర్యం కలుగడంతోపాటు మార్పు వస్తున్నది.
– ఐఈఆర్పీ, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా