ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 42,003 మంది విద్యార్థులు
240 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి నిరాకరణ
పదో తరగతి వార్షిక పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వరకు జరిగే ఎగ్జామ్స్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష కొనసాగనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 240 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 42, 003 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండనుంది.
రామగిరి, మే 22 : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 42, 003 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరి కోసం 240 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సిబ్బందిని అన్ని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 9:30కి పరీక్ష ప్రారంభమవుతుండగా గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నల్లగొండ జిల్లాలో 107 పరీక్షా కేంద్రాల్లో 19,915 మంది విద్యార్థులు పరీక్ష రాయను న్నారు. సూర్యాపేట జిల్లాలో 73 కేంద్రాల్లో 12, 612మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో 9,476 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
మిర్యాలగూడలో…
మిర్యాలగూడ పట్టణం, మండల పరిధిలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు. పట్టణంలోని 12 పరీక్ష కేంద్రాల్లో 2,340 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
తిప్పర్తిలో..
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి నర్సింహ తెలిపారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని, మండలంలో మొత్తం 300 మంది విద్యార్థులు పరీక్షకు హజరు కానున్నట్లు చెప్పారు. మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు. విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.
కట్టంగూర్లో పరీక్ష రాయనున్న 394 మంది విద్యార్థులు
కట్టంగూర్ : మండలకేంద్రంలో సోమవారం నుంచి జూన్ 1 వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ మేక నాగయ్య తెలిపారు. ఆదివారం రెండు పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 216 మంది, సాందీపని పాఠశాలలో 178 మంది మొత్తం 394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల్లో ఇద్దరు చీఫ్ సూరరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్మెంట్ అధికారులు, 19 మంది ఇన్విజిలేటర్లు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
శాలిగౌరారంలో…
పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి నాగయ్య ఆదివారం వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో(134), గీతాంజలి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో(114), మాదారం కలాన్ ఉన్నత పాఠశాలలో(107)మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
హాలియాలో…
సోమవారం నుంచి 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనుముల మండలంలో 810 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నారు. మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ కారణంగా పదవ తరగతి పరీక్షలు ఆలస్యమయ్యాయి. మార్చిలో జరగాల్సిన పది పరీక్షలను మేలో నిర్వహిస్తున్నారు. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది. హాలియాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో గదికి 3 ఫ్యాన్లతో డెస్క్ బెంచీలు, ఏర్పాటు చేసి మంచినీటి వసతి సౌకర్యం కల్పించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను సకాలంలో వచ్చి పరీక్షలు రాయాల్సిందిగా ఎంఈఓ బాలూనాయక్ కోరారు.
త్రిపురారంలో…
సోమవారం నుంచి జరిగే ‘పది’ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు. మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులంతా గంట ముం దుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవా లని తెలిపారు. మండల వ్యాప్తంగా 430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్టికెట్లు అందని వారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రానికి రావాలని పేర్కొన్నారు.
దేవరకొండలో..
పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెంట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ పట్టణంలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్ధానిక జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాల, ఎస్టీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
దామరచర్లలో..
సోమవారం నుంచి నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు మండలంలో సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈఓ బాలాజీనాయక్ తెలిపారు. దామరచర్ల, వాడపల్లి, కొండ్రపోల్ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 560 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్ రానివారు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
కేతేపల్లిలో…
సోమవారం నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండలంలో కేతేపల్లి, చెర్కుపల్లిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేతేపల్లిలో 266 మంది, చెర్కుపల్లిలో 175 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నారు. మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఎం.నాగయ్య పరిశీలించారు.
నార్కట్పల్లిలో…
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలో 667మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఎంఈఓ నర్సింహ ఆదివారం విలేకరులకు తెలిపారు. పరీ క్షల నిర్వహణకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నార్కట్పల్లి జడ్పీ పాఠశాలలో 148మంది, అమ్మ నబోలులో 103, బ్రాహ్మణ వెల్లెంలలో 100, ఎస్పీఆర్ పాఠశాలలో 199, చేతన పాఠశాలలో 117మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాను న్నట్లు తెలిపారు. 55మంది ఇన్విజిలేటర్లు, 5 చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.
పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం
దేవరకొండ, మే 22 : దేవరకొండ ఆర్టీసీ డిపో పరిధిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ రాజీవ్ప్రేమ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్షిక పరీక్షలకు వెళ్లే విద్యార్ధులు పదో తరగతి హాల్టికెట్, బస్పాస్ ఉన్నట్లయితే కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.