రామగిరి, ఏప్రిల్ 1 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జయచంద్రరెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామ కవితాదయాకర్తో పాటు ఆలయ చైర్మన్ చకిలం వేణుగోపాల్రావు దంపతులు, ఆలయ ఈఓ జయరామయ్య, ధర్మకర్తలు హోమం, ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం లోపలి నుంచి స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లను పల్లకిలో ఎమ్మెల్యే మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాట, నృత్య ప్రదర్శనలు, భజనలు, భజనలు ఆకట్టుకున్నాయి.
తెలంగాణ అర్చక, ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.శేఖర్ రాములవారి రథోత్సవ విశిష్టతను తెలిపారు. రథం ఆలయం నుంచి రామగిరి, ఎన్జీ కళాశాల, ఎన్టీఆర్ విగ్రహం, టీటీడీ కల్యాణ మండపం మీదుగా తిరిగి రామాలయానికి చేరుకుంది. రథోత్సవం సాగినంత సేపు కండ్లు మిరుమిట్లు గొలిపేలా నింగిలో బాణాసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. రథోత్సవంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, డీఎస్పీ నర్సింహారెడ్డి, సీఐ ఆదిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, ధర్మకర్తలు యాట జయప్రద, పాదాం ప్రియంక, వేదాంతం శ్రీనివాసాచార్యులు, మిర్యాల స్వామి, మామిండ్ల హనుమంతు, ఆలయ అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాలాచార్యులు, రఘునందనాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.