నీలగిరి, ఏప్రిల్ 15 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థి ఊరేగింపు ర్యాలీ రిటర్నింగ్ కార్యాలయం నుంచి 100 మీటర్ల దూరం వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయం రావడానికి కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, నామినేషన్ దాఖలు చేసేందుకు ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. వాహనాలకు అభ్యర్థి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అందుకు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఒరిజినల్ కాపీ ప్రదర్శించాలని, వాహనం ముందు అద్దంపై పర్మిట్ నంబర్, అభ్యర్ధి పేరు, వాహనం నంబర్ ఎవరికి జారీ చేశారో కచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి తీసుకున్న పర్మిట్ మరొక అభ్యర్థి ఉపయోగించవద్దని తెలిపారు. ఎవరైనా కోడ్ను ఉల్లంఘిస్తే సెక్షన్ 188 ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 129 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.