గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే తొలి విడుతగా జిల్లాలో 16వేల మందికిపైగా యూనిట్లు అందించగా మందలు రెట్టింపవుతున్నాయి. మరో విడుత పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం కాగా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 మండలాల్లో 244 గొర్రెల కాపరుల సంఘాలుండగా 15 వేల మంది లబ్ధిదారులున్నట్లు అంచనా. ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలు ఇవ్వనుండగా రూ.1.75 లక్షల్లో లబ్ధిదారులు 25 శాతం వాటా రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది.
చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 4 : గొల్లకుర్మలకు త్వరలోనే రెండో విడుత గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కసరత్తు చేపట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పథకం విధివిధానాలను సంఘాల సభ్యులకు చేరవేశారు. సమావేశాలు సైతం ఏర్పాటు చేసి పథకం గురించి పూర్తిస్థాయిలో వివరించారు. ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలు అందగానే లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నారు.
15 వేల మంది లబ్ధిదారులు..
జిల్లాలోని 17 మండలాల్లో 244 గొర్రెల కాపరుల సంఘాలున్నాయి. వీటిలో రెండో విడుతలో 15 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో ఒక్కొక్కరికి రూ.1.75 లక్షల విలువైన 20 గొర్రెలతోపాటు ఒక పొట్టెలు ఇవ్వనున్నారు. 75 శాతం సబ్సిడీపై ప్రభుత్వం వీటిని అందజేయనున్నది. లబ్ధిదారుడు తన బ్యాంకు ఖాతా ద్వారా కేవలం రూ.43,750 డీడీ చెల్లిస్తారు. ఒక యూనిట్కు ప్రభుత్వం రూ.1.48 లక్షలు ఖర్చు చేయగా, పొట్టేలుకు రూ.10వేల ఆదనపు భారం పడుతుంది. ట్రాన్స్పోర్టు, బీమా ఇతర ఖర్చులు కలిపి యూనిట్ ధర రూ.1.75 లక్షలు కానున్నది. కాగా, 2018 సంవత్సరంలో మొదటి విడుతలో 16 వేల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి దాదాపు పూర్తిస్థాయిలో పంపిణీ చేశారు. ఫలితంగా మొదటి విడుతవారు ఉపాధి పొందటమే కాకుండా ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
లబ్ధిదారుడు స్థానిక గొర్రెల సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 2017 మే నాటికి18ఏండ్లు నిండి ఉండాలి. కుటుంబ సభ్యులు కూడా అర్హులు. ప్రభుత్వ ఉద్యోగికి ఈ పథకం వర్తించదు. ఇంతకుముందు లబ్ధిదారులకు నిర్వహించిన గ్రామసభలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఏ, బీ జాబితాలో పేరు నమోదు చేసి ఉండాలి. మండల పశువైద్యుడి వద్ద ఉన్న ఈ-ల్యాబ్లో పేరు నమోదై ఉండాలి.
ఉత్తర్వులు రాగానే అమలు
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే రెండో విడుత గొర్రెల పంపిణీ అమలు చేస్తాం. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. డీడీలు కట్టినవారికి ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు రాగానే యూనిట్లు పంపిణీ చేస్తాం. కిందిస్థాయిలో లబ్ధిదారులకు సమావేశాలు సైతం నిర్వహించాం.
– కృష్ణ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి
గొల్లకుర్మలకు ప్రభుత్వం చేయూత
గొల్లకుర్మల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పెంపకందారులు ఆర్థికంగా ఎదిగేందుకు 75 శాతం సబ్సిడీతో కాపరులకు గొర్రెలు అందిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 16 వేల మందికి లబ్ధి చేకూరింది. రెండో విడుతలోనూ వేలాదిమందికి ప్రయోజనం చేకూరనుంది. సీఎం కేసీఆర్కు గొల్లకుర్మలమంతా రుణపడి ఉంటాం.
– గుండెబోయిన ఆయోధ్యయాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు
సీఎం సారు బతుకుదెరువు చూపిస్తుండు
గొల్లకుర్మలను అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నడు. జీవాలను ఇచ్చి మాకు బతుకుదేరువు చూపిస్తుండు. ఇంతకుముందు ఎవరూ ఇట్లా చేయలేదు. గొర్రెలను మా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుండు. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– గుండెబోయిన మల్లయ్యయాదవ్, లబ్ధిదారుడు, పెద్దకొండూరు