నల్లగొండ ప్రతినిధి,జనవరి 30 (నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు బడులు నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్తాబవుతున్నాయి. సమస్యలను దూరం చేసుకుని.. అందమైన క్లాస్ రూమ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ బోర్డులు, భవనాలకు ఆకర్షణీయమైన రంగులతో సరికొత్తగా కనిపిస్తున్నాయి. మన ఊరు మన బడి మొదటి విడుతలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 1,097స్కూళ్లను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేయగా.. నూతన నిర్మాణాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.317.11కోట్లు మంజూరు చేసింది. వాటిల్లో అన్ని చోట్లా గుర్తించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 57 పాఠశాలలు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధం కాగా, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలుఎక్కడికక్కడ బుధవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన
విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర సర్కారు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో భాగంగా నల్లగొండ జిల్లాలో 517 పాఠశాలలను ఎంపిక చేయగా 32 స్కూళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 329 పాఠశాలలను ఎంపిక చేయగా 7 స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.
తొలి విడుతలో 517 పాఠశాలల ఎంపిక
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 517 ఫ్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటి పూర్తికి రూ. 152 కోట్లు కేటాయించారు. అందులో 396 పాఠశాలల్లో రూ. 30లక్షల్లోపు నిధులతో విద్యాశాఖ గుర్తించిన పనులు త్వరితగతిన పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా 101 స్కూళ్లలో రూ. 30 లక్షలకు పైగా వ్యయంతో పనులు చేపట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఒకే రకమైన పెయింటింగ్తో ప్రత్యేకంగా ఉండేలా పనులు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 251 స్కూళ్లు
యాదాద్రి భువనగిరి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 251 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో 83 హైస్కూళ్లు, 148 ప్రాథమిక, 20 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పునర్నిర్మాణానికి, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 48.3కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 18 బడుల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తికాగా ఫిబ్రవరి 1న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మునుగోడు మండలంలో 15 పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు
మునుగోడు రూరల్ : మునుగోడు మండల వ్యాప్తంగా 15 పాఠశాలలు మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఎంపికయ్యాయి. వీటిలో మునుగోడు, పలివెల, కొరటికల్, కిష్టాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. చీకటిమామిడి ప్రాథమికోన్నత పాఠశాల.. లక్ష్మీదేవిగూడెం, మునుగోడు, కొరటికల్, కల్వలపల్లి, కొంపల్లి, ఇప్పర్తి, కిష్టాపురం, ఊకొండి, పలివెల, వెల్మకన్నె ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో రూ.5.40 కోట్లతో కావాల్సిన నిర్మాణాలు, వసతుల కల్పనపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రైవేట్కు దీటుగా మారనున్నాయి.
ఇది నల్లగొండ పట్టణంలోని పద్మనగర్లోని మిర్యాల కమలమ్మ వెంకటేశం గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల(ఎంకేవీజీపీఎస్). ఇక్కడ ప్రస్తుతం 205 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. సరైన తాగునీటి వసతి లేదు. మరుగుదొడ్ల అసౌకర్యంగా ఉండే. అన్ని తరగతి గదుల్లో కరెంటు సౌకర్యం లేదు. దీంతో ఫ్యాన్లు తిరుగక, లైట్లు లేక ఇబ్బందులు తప్పేవి కావు. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంలో ఈ పాఠశాల ఎంపికైంది. పైగా అత్యధిక విద్యార్థులు ఉండడంతో మండల స్థాయిలో మోడల్ స్కూల్గానూ ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో రూ.10.70లక్షల వ్యయంతో పనులు చేపట్టారు. దాంతో పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. సకల హంగులు సమకూరాయి. స్కూల్ మొత్తాన్ని ప్రత్యేక పెయిటింగ్తో ముస్తాబు చేశారు. బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు. తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఇక ప్రతి తరగతికి కరెంటు సౌకర్యం కల్పిస్తూ ఫ్యాన్లు, లైట్లు బిగించారు. ఇక ప్రతి గదిలో గ్రీన్బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇక పాఠశాల ఆవరణ అంతా టైల్స్తో అందంగా తీర్చిదిద్దారు. బుధవారం ఈ పాఠశాలను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. నేటి సాయంత్రాన్ని చెట్లను సైతం నాటేందుకు ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నారు.
సరికొత్తగా రామచంద్రపురం, గార్లబాయిగూడెం పాఠశాలలుకట్టంగూర్ : మండలంలో 5 ఉన్నత, 13 ప్రాథమిక పాఠశాలలను మన ఊరు-మన బడి కింద తొలి దశలో ఎంపిక చేశారు. గార్లబాయిగూడెం, రామచంద్రపురం ప్రాథమిక పాఠశాలల్లో పనులు పూర్తి చేసి అన్ని హంగులతో సిద్ధం చేశారు. మిగతా పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.
లక్ష్మీదేవిగూడెం ప్రాథమిక పాఠశాలలో రూ.8.88 లక్షలతో పనులు
మునుగోడు, జనవరి30 : మండల కేంద్రంలోని లక్ష్మీదేవిగూడెం ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు చదువుతున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం 8.88లక్షలు మంజూరు చేసింది. రూ.1.84,585 లతో విద్యుత్ వ్యవస్థను మెరుగు చేశారు.తాగునీటి వసతికోసంరూ.73,751 ఖర్చు చేశారు. రూ.5,53,148లతో డైనింగ్హాలు, మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణం, పాత భవనాల మరమ్మతులు చేయించారు. ఈ బడిని కార్పొరేట్ స్కూల్ను తలదన్నేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని తరగతి గదుల్లో విద్యుత్ లైట్లు, ప్యాన్లు ఏర్పాటు చేశారు.
ముమ్మరంగా పనులు..
ఇలా ఒక్క నల్లగొండ అర్బన్, రూరల్ మండలంలోనే మొత్తం 36 పాఠశాలల్లో రూ.8.56కోట్ల నిధులతో సర్కార్ పాఠశాలలను ఆధునీకరిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్ధులు సానుకూల వాతావరణంగా విద్యను అభ్యసించేలా కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. ప్రభుత్వం సర్కార్ బడుల బలోపేతానికి ‘మన ఊరు- మనబడి’ ‘మనబస్తీ – మనబడి’ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరంలో నల్లగొండ జిల్లా వాప్తంగా 1,483 ప్రభుత్వ పాఠశాలలుండగా తొలివిడుతలో 517 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో నిబంధనల ప్రకారం పనుల పూర్తికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలంటే పరిశుభ్రత లేని పరిసరాలు, టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం, గోడలు, గది తలుపులు శిథిలావస్థకు చేరి ఉండడం కనిపించేవి. మన ఊరు-మన బడి కార్యక్రమంతో అన్ని వసతులు సమకూరాయి. ప్రభుత్వ పాఠశాల బలోపేతంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
– పెద్దిరెడ్డి సుధాకర్రెడ్డి ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశా ఆరెగూడెం, చిట్యాల మండలం
మా స్కూల్ ఇప్పుడు చాలా బాగుంది
మా పాఠశాలలో తరగతి గదులకు మరమ్మతులు చేశారు. గోడలకు రంగులు వేశారు. వంట షెడ్డు, టాయిలెట్లు కట్టారు. కరెంట్, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మా బడి కొత్తగా కనిపిస్తున్నది. నేను ఒకటో తరగతి నుంచి ఈ పాఠశాలలోనే చదువుతున్నా. గతంలో వసతులు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి.
– చింత కావ్య, గార్లబాయిగూడెం 5వ తరగతి విద్యార్థిని