హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రతి ఏడాదీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం కాదని.. లక్షలాది మంది విద్యార్థులకు గత నాలుగు విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిల మాటేమిటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు 10వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఆ బకాయిల సంగతి ఏంటో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఇప్పటికీ సర్టిఫికెట్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. లక్షల మంది విద్యార్థులు ఫీజు బకాయిలు సక్రమంగా రాక కళాశాలల్లో సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.