భీమ్గల్/వేల్పూర్, జూలై 29 : మన ఊరు-మన బడి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, ముచ్కూర్ పాఠశాలల విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త దయానంద్రెడ్డి అందించిన రూ.2 లక్షల విలువైన డ్యుయల్ డెస్క్ బెంచీలను బుధవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం వేముల మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని, ప్రభుత్వాలు మారినా మంచి కార్యక్రమాలను కొనసాగించడం పాలకుల బాధ్యత అని గుర్తుచేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద నియోజకవర్గంలోని అనేక పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని గుర్తుచేశారు.
ముచ్కూర్లో కాంట్రాక్టర్లు సొంత నిధులతో శ్లాబ్ పనులు పూర్తి చేశారని, వారికి రూ. 30 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్పప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని బలంగా లేవనెత్తుతానని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటుహక్కు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను అరికట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రెవెన్యూ అధికారులను కోరారు. వేల్పూర్ తహసీల్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ‘సర్’ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘సర్’ను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ పక్షాన అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలను సమర్పించినట్టు వెల్లడించారు.