మునుగోడు, మే 12 : డీలర్లు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని నల్లగొండ జిల్లా మునుగోడు వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. సోమవారం మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లకు మునుగోడు రైతువేదిక నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందుబాటులో ఉంచాలని, అలాగే ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు.
విత్తనాలు, ఎరువుల అమ్మకపు వివరాలను రికార్డుల్లో ప్రతిరోజు పొందుపరచాలని సూచించారు. పత్తి విత్తనాలను ఎమ్మార్పీ ధర, వ్యవసాయ అధికారి ఫోన్ నంబర్ తో ఫ్లెక్సీలను ప్రతి విత్తన దుకాణం ముందు పెట్టాలన్నారు. రైతులకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే తమకు సమాచారం తెలుపాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని, లైసెన్స్ ఉన్న దుకాణాల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, బిల్లులను పంట కాలం పూర్తి అయ్యేవరకు జాగ్రత్త చేసుకోవాలన్నారు.