నల్లగొండ, జనవరి 30 : గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం పాలన ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఫిబ్రవరి-1తో ఐదేండ్ల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు వారితోనే పాలన చేపట్టనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీల అమలు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నది. దాంతో ప్రత్యేక అధికారుల పాలనను తెరమీదకు తెచ్చింది. తమకు మరో ఆరు నెలలు అవకాశం ఇచ్చి, పర్సన్ ఇన్చార్జిలను నియమించాలని సర్పంచులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు. దాంతో ఫిబ్రవరి-1 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన రానుండగా సర్పంచుల ప్రాధాన్యం ఇక ఉండదు. పెద్ద గ్రామ పంచాయతీలకు గెజిటెడ్ అధికారులను, చిన్న పంచాయతీలకు నాన్ గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేటలో 475, యాదాద్రి భువనగిరిలో 421. ఆయా జిల్లాలో 2019 జనవరి 24, 27, 30 తేదీల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలుగా జరిగాయి. కొత్తగా ఎన్నికైన పాలక వర్గాలు ఫిబ్రవరి-2న సమావేశం నిర్వహించి కొలువు దీరినందున ఫిబ్రవరి-1తో వారి గడువు ముగియనుంది. ఆ లోపే ఈ దఫా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల రీత్యా ఎన్నికలు జరుగలేదు. పాలక వర్గాల పాలన గడువు రేపు ముగియనుండడంతో ఈ నెల 2నుంచి ప్రత్యేక అధికారులకు పాలన బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో పత్యేక పాలన షురూ కానుండడంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు ఒక ప్రత్యేక అధికారిని జత చేసి చెక్ పవర్ ఇచ్చి పాలన కొనసాగించనున్నారు. ఆయా గ్రామాల్లో జూనియర్, టైపిస్ట్ లాంటి అధికారులను కాకుండా కాస్త పెద్ద హోదా ఉన్న అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని కార్యదర్శులు ప్రభుత్వానికి విన్నవించారు. దాంతో పెద్ద గ్రామ పంచాయతీల్లో గెజిటెడ్ అధికారులు అంటే ఎంపీడీఓలు, తాసీల్దార్లు, ఎంపీఓలు, పలు శాఖల ఏఈలు, ఏఓలు, హైస్కూల్ హెచ్ఎంలను, చిన్న గ్రామ పంచాయతీల్లో సీనియర్ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులను నియమించనున్నారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవనుండగా మరో ఆరు నెలల తర్వాతనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలన చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టాల్సిన ఆరు గ్యారెంటీలపై మొదట దృష్టి పెట్టింది. ఆ గ్యారెంటీలు అమలు చేసే లోపే పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక కొత్త ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాత రిజర్వేషన్లే అయితే జూన్ లేదా జూలైలో ఈ పల్లె పోరు జరుగనున్నది. ఒక వేళ రిజర్వేషన్లు మార్చాలి అంటే మరోసారి చట్టం చేయాల్సి ఉండే అవకాశం ఉన్నందున మరికొంత ఆలస్యం కానుంది. ఇదిలా ఉండగా ఇదే సంవత్సరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.