గరిడేపల్లి, డిసెంబర్ 6 : ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడమే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రైతులు తమకున్న కొద్ది మేర నీటి వనరులను ఉపయోగించుకుంటూ నేల రకాన్ని బట్టి ఆరుతడి పంటలను సాగు చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని తెలుపుతున్నారు. అయితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రనేలలు, నల్లరేగడి, ఇసుక, రాతి నేలలు ఉన్నాయి.
రైతులు తమ భూమిలో ఆరు తడి పంటల్లో ఏదో ఒకటి అన్నట్టు కాకుండా నేలల రకానికి అనుగుణంగా పంటలను సాగు చేయాలి. వాటిలో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ దొంగరి నరేశ్ సూచిస్తున్నారు. పంటల సాగులో నేల రకమే కీలకమని, దానికి అనుగుణంగా పంటలను ఎంచుకుని సాగు చేయాలని తెలిపారు. ఏ నేలలో ఏ రకాలను సాగు చేయాలనే విషయాలను ఆయన వివరించారు. అదనపు సమాచారం కోసం 9290615952 నెంబర్ను సంప్రదించవచ్చు.
వేరుశనగ : యాసంగిలో జనవరి చివరి వరకు వేసుకోవచ్చు. గరప, నీరు త్వరగా ఇంకే ఎర్ర చెల్క నేలలు అనువైనవి. 100 – 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. అనువైన విత్తన రకాలు : కదిరి 6, 7, 8, 9, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ – 91114, ధరణి, కదిరి లేపాక్షి (కే-1812)
చెరుకు : డిసెంబర్ నుంచి మార్చి వరకు నాటుకోవచ్చు. చౌడు భూముల్లో నాటుకునే వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. నీటి సదుపాయం కలిగిన నల్లరేగడి, ఒండ్రు, మెరక భూములు అనువైనవి.
అనువైన విత్తన రకాలు : కో- 6907, కో-8014, కో-94008, కో-419, కో-811, కో, ఆర్ – 8001
నువ్వులు : మురుగు నీరు నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు.
విత్తే సమయం : జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. 85- 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది.
పొద్దుతిరుగుడు : నీరు నిల్వ ఉండని ఎర్ర చెల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు శ్రేష్టమైనవి. అంతర పంటగా 4 ః 2 నిష్పత్తిలో వేరుశనగ + పొద్దుతిరుగుడు, 1 ః 2 నిష్పత్తిలో కంది + పొద్దు తిరుగుడు సాగు చేయవచ్చు. ఎకరానికి 2.5 – 3 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. పంట కాలం 90 – 95 రోజులు. దిగుబడి 5 – 6 క్వింటాళ్లు.
విత్తన రకాలు : కేబీఎస్హెచ్- 44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1.
ఆముదం : దీని పంటకాలం 120 నుంచి 140 రోజులు. యాసంగిలో అక్టోబర్ రెండో పక్షంలో విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు. ఆముదం + కంది 1 ః 1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
ఆవాలు : మోస్తరు బరువైన నేలలు మంచి దిగుబడులను ఇస్తాయి. తేలికపాటి నేలలు, నల్లరేగడి, ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. పంట కాలం 120 – 125 రోజులు, విత్తన రకాలు : పూసా అగ్రాని, వరుణ, పూసా మహల్, నరేంద్ర
కుసుమ : యాసంగి పంటగా దీనిని నాటుకోవచ్చు. నీరు నిల్వని బరువైన తేమ నిలుపుకొనే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు అనుకూలం. 125 – 130 రోజుల పంటకాలం. 4 కిలోల విత్తనాలు ఎకరానికి అవసరమవుతాయి.
మొక్కజొన్న : నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు, ఇసుక నేలలు అనుకూలమైనవి. మొక్కజొన్నను యాసంగిలో నవంబర్ మూడో వారం వరకు విత్తుకోవచ్చు. పంట కాలం 105 – 120 రోజులు. 8 కిలోల విత్తనాలు ఎకరానికి అవసరమవుతాయి.
జొన్న : నల్లరేగడి, తేలికైన ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పంటకాలం 110- 115 రోజులు. ఎకరానికి 3- 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
అలసంద : నల్లరేగడి, ఎర్రనేలలు, నీరు నిల్వని నేలలు అనుకూలం. యాసంగి పంటగా ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. పంట కాలం 110 రోజులు. ఎకరానికి 8- 10 కిలోల విత్తనాలు అవసరం. పశుగ్రాసంగా, పచ్చిరొట్టగా వేస్తే 12- 14 కిలోల విత్తనాలు అవసరం.
కంది : యాసంగిలో స్వల్పకాలిక రకాలు సాగు చేయవచ్చు. నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు అనుకూలం. 120 – 130 రోజుల పంటకాలం.
పెసర, మినుము : వానకాలం వరి తర్వాత 15 నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు అత్యంత బరువైన నల్లరేగడి నేలలు అనుకూలం. పెసర 60 – 65 రోజుల్లో పంట కోతకు వస్తుంది. మినుము 70- 80 రోజుల్లో కోతకు వస్తుంది.
పెసర : డబ్ల్యూజీజీ – 37 (ఏకశిల), ఎజీజీ – 347, (మాదిర పెసర) మినుము : ఎల్బీజీ – 752, ఎల్బీజీ – 20, ఎల్బీజీ – 26 పీయూ- 31
ప్రస్తుత పరిస్థితిలో యాసంగిలో ఆరు తడి పంటల సాగుతోనే రైతుకు మేలు జరుగుతుంది. ఆరుతడి పంటలుగా ఒకే పంటను కాకుండా అంతర పంటలు సాగు చేయడం ద్వారా రైతు నికర ఆదాయం పెరుగుతుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. పప్పు దినుసులు సాగు చేస్తే వాటి మొక్కల వేర్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి భూసారం పెరుగుతుంది. ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య సైతం పెరుగుతుంది. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్, గడ్డిపల్లి