సద్దుల బతుకమ్మ పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు సంతోషంగా ఆడిపాడారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని వెంట తెచ్చుకున్న సద్దులను ఆరగించారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆయన సతీమణి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పలుచోట్ల మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా భాగస్వామ్యమయ్యారు.
రామగిరి, అక్టోబర్ 22 : పుడమి తల్లి పూల శోభతో పులకరించింది. 9 రోజుల బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు పెద్ద బతుకమ్మను ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబురాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగాయి. వాడవాడనా ఆడబిడ్డల బతుకమ్మ పాటలతో హోరెత్తాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి మహిళలు రాత్రి పొద్దుపోయే దాకా ఆడిపాడగా పల్లె, పట్నం హరివిల్లులా మారింది. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా. మమ్ములందరినీ చల్లంగా చూడు.. వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. దీంతో 9 రోజుల బతుకమ్మ సంబురాలు ముగిశాయి.