Rythu Bandhu | ‘అది యాసంగి సీజన్. రైతులు నాట్లు వేయడం కూడా ప్రారంభించ లేదు. అప్పుడప్పుడే పొలంలోకి దిగి దుక్కులు దున్నుతున్నారు. జేబులో ఉన్న ఫోన్కు టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఏంటని చూస్తే రైతుబంధు పెట్టుబడి సాయం డబ్బులు..’ ఇదీ గతేడాది యాసంగి సీజన్లో అన్నదాతలకు ప్రభుత్వం జమ చేసిన తీరు. సకాలంలో పెట్టుబడి సాయం అందడంతో సంతోషంగా సాగు పనులు చేసుకున్నారు. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. యాసంగి సీజన్ సగం ముగిసినా, పొలం పనులు పూర్తయ్యినా, ఎండాకాలం సమీపిస్తున్నా ఇంకా రైతుబంధు డబ్బులు జమ కాలేదు. జిల్లాలో సగం చెల్లింపులు కూడా కాలేదు. దాంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏటా రెండు సార్లు ఎకరాకు రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేది. ఎకరా నుంచి మొదలుకొని అర్హులు అందరికీ ఇచ్చేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ. 15వేల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని వాగ్దానం చేసింది. అది కూడా డిసెంబర్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్కు ఏటా రూ. 5వేలు జమ చేసినట్లే ఇస్తామని ప్రకటించింది. కొత్త నిబంధనలు రూపొందించలేదనే సాకుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును అమలు చేసింది. ఇప్పుడు పాత పద్ధతి ప్రకారం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం లేదు.
ఈ సీజన్లో జిల్లాలో 2,71,590 మందికి రైతుబంధు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. ఇందుకు రూ. 304 కోట్లు అవసరం కానున్నాయి. గతంలో మాదిరిగా మొదటగా చిన్న, సన్నకారుల రైతులకు ప్రాధాన్యం ఇస్తారని, దశల వారీగా మిగతావారికీ అందిస్తారని పేర్కొంటున్నారు. జిల్లాలో 13వ తేదీ నుంచి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమం చేయడం ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా డబ్బులు మాత్రం రైతుల ఖాతాల్లో వేయడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 1,81,063 మంది రైతులకు రూ. 112,10,67,414 మాత్రమే అకౌంట్లలో డిపాజిట్ అయ్యాయి. ఇంకా 90,524 మందికి రూ. 192,67,78,376 డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇవి కూడా ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని పలు చోట్ల యాసంగి సాగు పనులు పూర్తయ్యాయి. ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నెలన్నర రోజులుగా సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. పొలాల్లో దుక్కులు దున్నారు. కూలీలను రప్పించి నాట్లు వేయించారు. 2.71లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేయగా, ఇందులో 2.70 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రస్తుతం రైతులు యూరియా, ఎరువులు చల్లుతున్నారు. అయినప్పటికీ రైతుబంధు డబ్బులు అందకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేతిలో పెట్టుబడి సాయం లేకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. బ్యాంకుల్లో ఇప్పటికే రుణాలు తీసుకోవడంతో చేసేదేంలేక బయటకు మిత్తీలకు తీసుకున్నారు. ఇంకొందరు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకుని కాలం వెల్లదీస్తున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి సాగు పనులు మొదలు పెట్టగానే రైతుబంధు పైసలు వచ్చేవి. అప్పు చేయకుండానే వ్యవసాయం చేసుకునేటోళ్లం. ఈ సారి కాంగ్రెసోళ్లు వచ్చాక నాకున్న మూడున్నర ఎకరాలకు రైతు బంధు పైసలు పడలే. సావుకారు వద్ద అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టిన. వరి నాటు వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికే పైసలు పడకపోవడంతో గుబులు వేస్తుంది. పాత రోజుల్లా కాంగ్సెసోళ్లు రైతులను అప్పుల పాలు చేసేటట్టు అగుపిస్తున్నది. ఇట్నే కొనసాగితే చేసిన అప్పులు తీర్చేందుకు వ్యవసాయం విడిచి పట్నాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.
-భూక్యా భద్రునాయక్, పుట్టెగూడెం, రాజాపేట మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక రైతులకు రైతుబంధు పడటం లేదు. ఇప్పటి వరకు నాకు రైతుబ ంధు పైసలు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట పెట్టుబడి సాయం సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. వ్యవసాయానికి ఏ రందీ లేకుండేది. నాకున్న రెండు ఎకరాల భూమికి సంబంధించిన రైతు బంధు పైసలు ఎప్పుడు పడుతాయో ఏమో అర్థం కావడం లేదు. రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఇప్పుడు నట్టేటా ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
-ప్రశాంత్, రైతు, ఆలేరు