రైతుల వెతలు తెలిసిన నేతగా, రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు మరోసారి రైతుబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారు. ప్రస్తుత వానకాలానికి సంబంధించి పట్టాదారు పాస్పుస్తకం ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో బుధవారం సాయంత్రం వరకు పంట పెట్టుబడి సాయం జమ చేశారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.31 లక్షల మంది రైతులకు 24.31లక్షల ఎకరాలకుగానూ రూ.1215.91 కోట్లను అందజేశారు. 11వ విడుతల్లో కలిపి ఇప్పటివరకు రైతులకు 11,610 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందింది.
-నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రైతుకు వ్యవసాయంలో ఆర్థికంగా పెట్టుబడికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 10వేల రూపాయలను అందజేస్తూ వస్తున్నారు. ఈ వానకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేశారు. జూన్ 26నుంచి దశల వారీగా ఆర్థిక వెసులుబాటును బట్టి రైతుబంధు నగదును పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతుల నుంచి దశల వారీగా డబ్బును పంపిణీ చేశారు. బుధవారంతో పట్టాదారు పాసుపుస్తకం ఉండి వివరాలు అందజేసిన ప్రతి రైతుకూ నగదు పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
సీజన్ సీజన్కు పెట్టుబడి సాయం అంతకంతకూ పెరిగిపోతున్నది. గతంతో పోలిస్తే సీజన్లో రైతుల సంఖ్యతోపాటు నగదు కూడా భారీగా పెరిగింది. 11వ విడుతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 10,31,692 మంది రైతులకు గాను రూ.1,215.91 కోట్లు అందజేశారు. మొత్తం 24.31 లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఎకరానికి ఐదు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లాలో మొత్తం 5,08,756 మంది రైతులకు గాను 609.67 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా పంపణీ చేశారు. సూర్యాపేటలో 2,77,357 మంది రైతులకు గాను రూ.311.28 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,45,579 మంది రైతులకు 294.96 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల మేరకు ప్రతి రైతుకూ రైతుబంధు నగదును వారి ఖాతాల్లో జమ చేశారు.
ఉమ్మడి జిల్లాలో రూ.11,610కోట్ల సాయం
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 11 విడుతల్లో కలిపి మొత్తం రూ.11,610 కోట్లు రైతులకు నగదు రూపంలో అందాయి. ఇందులో ప్రతి రూపాయి నేరుగా రైతుకే చెందడం విశేషం. గతంలో ఏ పథకంలో అయినా దళారుల ప్రమేయం లేదా వివిధ రూపాల్లో లంచాలు ఇతరత్రా కారణాలతో 10 నుంచి 20శాతం సాయం దారి మళ్లేది. కానీ.. ఇందులో ఎవరికీ సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేస్తూ వస్తున్నారు. రైతు తన వివరాలను వ్యవసాయ శాఖకు అందజేస్తే వారు ఆ వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయగా.. ఆ వివరాల మేరకే పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి చేరుతున్నది. ఈ రకంగా ఇప్పటివరకు ప్రతి పైసా రైతులకే చెందింది. మొత్తం 11 విడుతల్లో కలిపి నల్లగొండ జిల్లాలో రూ.5,846.05కోట్లు, సూర్యాపేటలో రూ.2,998.85కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,765.26 కోట్ల్ల రూపాయలు రైతులకు చేరాయి. ఈ నగదుతో కొత్తగా ఎంతో మంది రైతులు వ్యవసాయంలోకి దిగారు. గతంలో భూములు వదిలి వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటల సాగులో బిజీ అయ్యారు. 2014కు పూర్వం ఉమ్మడి జిల్లాలో 13లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు కాగా.. నేడు 24లక్షల ఎకరాలకు సాగుభూమి పెరిగిందంటేనే వ్యవసాయంలో వచ్చిన సమూల మార్పులను అర్థం చేసుకోవచ్చు.