పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు
రాజాపేట, మే 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని సింగారం గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. మూడేండ్లలో అభివృద్ధిలో దూసుకుపోతూ సరికొత్త హంగులు సంతరించుకున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చదనంతో కళకళలాడుతున్నది. వైకుంఠధామం, డంపింగ్యార్డు షెడ్ నిర్మాణంతో మౌలిక వసతులు సమకూరాయి. పల్లె పకృతి వనంతో పాటు వీధుల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం పరుచుకున్నది. వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి.
మూడు జిల్లాల సరిహద్దు..
సింగారం గ్రామంలో 1,300 మంది జనాభా, 962 ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెలా రూ.1.90లక్షలు కేయిస్తుండడంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, జీపీ సిబ్బందికి నెలనెలా జీతాలను అందిస్తూ పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపడుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పల్లె పగ్రతి పనులు పూర్తి…
సింగారంలో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ. 2లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.1.40 లక్షలతో గ్రామ వననర్సరీలను ఏర్పాటు చేశారు. ఆదేవిధంగా రూ. 30 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులతో పాటు రూ. 3.50 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు కాగా రూ.10లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. రూ.15 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా 6 వేల మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
గ్రామాలు హరిత మయం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల కల్పనతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. వైకుంఠధామాలు, డంపింగ్యార్డు షెడ్లు, ప్రకృతి వనాలు ప్రయోజనకరంగా మారాయి. వీధుల్లో సీసీ వేయడంతో కొత్తగా కనిపిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
– పారుపల్లి సుమలత, ఎంపీటీసీ సింగారం, రాజాపేట
పల్లె ప్రగతితోనే అభివృద్ధి…
పల్లె ప్రగతితోనే గ్రామంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించుకుంటున్నాం. గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలన్నీ ఒకే చోట నిర్మించుకున్నాం. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనం పెరిగింది. గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి.
– కర్ల కరుణాకర్రెడ్డి, సర్పంచ్, సింగారం
రూపు రేఖలు మారాయి…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం రూపు రేఖలు మారిపోయాయి. గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది. పల్లె పకృతి వనంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం, డంపింగ్యార్డు షెడ్ నిర్మాణాలు ప్రజలకు ప్రయోజకరంగా మారాయి.
– గడీల నర్సింహులు, ఉపసర్పంచ్, సింగారం, రాజాపేట