మర్రిగూడ, నవంబర్ 15 : రూ. 2వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపిస్తే కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారని, దాంతో ప్రాజెక్టులు తొందరగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని కొట్టాల, మేటిచందాపురం, సరంపేట, లెంకలపల్లి, కమ్మగూడెం, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, రాజపేటతండా, మర్రిగూడ, కొండూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ప్రాంత వాసినని, అందుకే మునుగోడు నియోజకవర్గమన్నా, ఇక్కడి ప్రజలన్నా తనకు ఎనలేని ప్రేమ అన్నారు.
ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కేవలం ఎన్నికల వరకు ఉండి పోయే రాజగోపాల్రెడ్డి లాంటి వాళ్లకు ప్రజలంటే ప్రేమ ఉండదన్నారు. తనకు సొంత పనులంటూ ఏమీ లేవని, మునుగోడు అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే తన పని అని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తర్వాత వందల కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేశానన్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు గట్టుప్పలను మండలంగా, చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. మర్రిగూడ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామాలను కలుపుతూ లింకురోడ్లు, బీటీ రోడ్లు వేసే పనులు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు మరో సారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడుకు ఏం చేసిండో చెప్పిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఈ ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పనికి కూడా కొబ్బరికాయ కొట్టిన పాపాన పోలేదన్నారు. తన కాంట్రాక్టులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికి తప్ప ప్రజలకు సేవ చేసేందుకు ఆయన పనికిరాడన్నారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయిందని, తెలంగాణలో ఆ పార్టీ లేచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం రాష్టాన్ని అంధకారంలో నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని 3 గంటలే చాలని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల మధ్య ఉండి పని చేసే వారికే ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి కొనసాగేందుకు బీఆర్ఎస్ను మరో మారు గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కారు గుర్తును మర్చిపోతే గోసపడుతామని పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు తోడు మరిన్ని పథకాలు అమలు చేయనున్నామన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని గీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారితో అల్లాడుతున్న నల్లగొండ జిల్లా ప్రజలను ఆ బాధ నుంచి విముక్తి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీటిని అందించి ఫ్లోరైడ్ను తరిమికొట్టారన్నారు. కారు గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణలు ఘన స్వాగతం పలికారు. కోలాటం, డప్పు దరువులతో ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మలు, బోనాలతో పాటు దారిపొడవునా కూసుకుంట్ల మీద పూల వర్షం కురింపించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు, వెంకటేశ్వర్రావు,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్, మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, సర్పంచులు నల్ల యాదయ్య, కల్లు స్వాతీనవీన్రెడ్డి, కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ఎంపీటీసీలు ఊరిపక్క సరితానగేశ్, శిలువేరు విష్ణు, కట్కూరి వెంకటేశ్, దళితబంధు డైరెక్టర్ లపంగి నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, నాయకులు ఐతగోని వెంకటయ్య గౌడ్, గంట కృష్ణ, చెర్కు లింగంగౌడ్, మారగోని రామన్న, పందుల పాండు, వూరె రమేశ్, ఐతగోని అశోక్, వర్కాల వెంకటేశ్, రేనుకుంట్ల నరేందర్, మార్నేని అంతయ్య, కొంపెల్లి నాగరాజుగౌడ్, జంపాల జయప్రసాద్, రాపోలు యాదగిరి, సైదులు యాదవ్ రామిడి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.