రైతు బీమా తరహాలోనే గీతకార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకూ చెట్టు మీదినుంచి పడి చనిపోయిన గౌడన్నలకు ఎక్స్గ్రేషియా అందిస్తుండగా, ఇక గీతకార్మికులు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే మానవతాదృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం కాగా, వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తే నల్లగొండ జిల్లాలో గీతవృత్తిపై ఆధారపడిన దాదాపు 30 వేల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగనున్నది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారు 50 ఏండ్ల వయస్సు గల గీతకార్మికులకు ఆసరా పింఛన్ ఇస్తుండడం, గతంలో ఉన్న ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, చెట్టు పన్నును రద్దు చేయడం, మద్యం దుకాణాల్లో గౌడ్స్కు 15శాతం రిజర్వేషన్ను కేటాయించడం తెలిసిందే.
-నల్లగొండ, ఆగస్టు 5
నల్లగొండ, ఆగస్టు 5 : ఒక్క గుంట జాగ ఉన్నప్పటికీ ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతు బీమా కల్పిస్తున్నది. ఇక నుంచి గీతా కార్మికులకు కూడా అదే విధంగా గీతా బీమా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. గతంలో గీతా కార్మికుడిగా లైసెన్సు పొందిన వారు తాటి చెట్టు పైనుంచి పడి చనిపోతేనే ఎక్స్గ్రేషియా వచ్చేది. అయితే ఇక నుంచి ఏ కారణం చేతనైనా, లేకుంటే సహజ మరణమైనా ఆ కుటుంబానికి భరోసా కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం గీతా బీమాను అమలు చేయనుంది. గతంలో రూ.2లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచిన సర్కార్ ఈ సాయాన్ని బీమా క్లెయిమ్ రూపంలో ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనికి సంబంధించి వారం రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేసి అమలు చేయనుంది.
గౌడన్నలకు ఆసరాగా సర్కార్..
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతా కార్మికలకు బాసటగా నిలబడి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నది. చెట్టు ఎక్కే కార్మికులకు ఏదో రకమైన ప్రయోజనం చేకూర్చి అండగా ఉంటున్న సర్కార్.. 2017-18 నుంచి తాటి చెట్టుకు శిస్తు కట్టే విధానాన్ని రద్దు చేసింది. దాంతో జిల్లాలో ఉన్న 30వేల మంది గీతా కార్మికులు ప్రతి ఏటా చెల్లించే రూ.70లక్షల పన్ను రద్దయింది. అంతేగాకండా 50 ఏండ్లు నిండిన వృత్తిదారులు చెట్లు ఎక్కడం మానేస్తున్న నేపథ్యంలో జిల్లాలో 7,162 మందికి ఆసరా పింఛన్ రూ.2016కు అందుతున్నది. అంతేగాకుండా తొలి సారిగా గౌడ సామాజిక వర్గానికి మద్యం దుకణాల్లో 15శాతం రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో 24 మద్యం దుకాణాలు గౌడ సామాజిక వర్గానికి దక్కాయి. త్వరలో ప్రతి వృత్తిదారుడు కల్లు తీసుకోని రావడానికి అనుగుణంగా ఉండే ద్విచక్ర వాహనాలు అందచేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.
గీతా కార్మికులకు ప్రయోజనం కోసమే…
గీతా కార్మికులకు ప్రభుత్వం నుంచి పలు రకాలుగా సాయం అందజేయాలనే ఆలోచనతో తొలిసారిగా గీతా కార్మిక ఆర్థిక సహకార కార్పొరేషన్ను క్రియేట్ చేసిన సర్కార్ ఈ పదవిని నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవి కుమార్ గౌడ్కే కేటాయించింది. ప్రస్తుతం గీతా కార్మికులకు అందే పథకాలతో పాటు మరిన్ని ప్రవేశపెట్టాలని ఈ సారి కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది.
వారంలో గీతా బీమాపై ఉత్తర్వులు
గీతా కార్మికులు గతంలో చెట్టు పైనుంచి పడి చనిపోతేనే ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా రూపంలో ఆర్థిక సాయం చేసేవి. అవి కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఇచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులు చెట్టు పైనుంచి పడి చనిపోతేనే కాకుండా సహజ మరణమైనా ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని అనుకుంటుంది. దాంతో రైతు ఎక్స్ గ్రేషియా కాకుండా రైతు బీమా తరహాలో గీతా బీమా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.
– బి.సంతోష్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, నల్లగొండ