మిర్యాలగూడటౌన్, మే 30: మిర్యాలగూడలోని ఓ వార్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను చూస్తుంటే నిధులు ఏ విధంగా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రూ. లక్షల నిధులతో చేసిన అభివృద్ధి పనులనే మళ్లీ చేస్తూ ప్రజా ధనం కాజేసే కుట్ర జరుగుతున్నది. మిర్యాలగూడలోని 40వ వార్డులో వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేని వార్డుల్లో పనులు చేపట్టకుండా అన్నీ బాగున్న చోట ఎలాంటి ఎస్టిమేషన్లు కానీ, నిధులు మంజూరీ లేఖ కానీ లేకుండా రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉందని, నిధులు ఎట్లయినా తెస్తామని అధికార బలంతో ఓ నాయకుడు ఏకంగా గతంలో వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేస్తుండటంతో అవార్డు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
దీంతో రోడ్డు ఎత్తు పెరిగి ఇండ్లు కిందకి అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని ఇండ్ల యజమానులు వాపోతున్నారు. పట్టణంలోని ఏరియా దవాఖాన వెనుక భాగంలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఈ రోడ్డుకు నిధులు మంజూరు కాలేదు. దీంతో మున్సిపల్ అధికారులు నిర్మాణ పనులను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఈ ఒక్క వార్డులోనే పనులు జరుగుతున్నాయి. దీంతో వివిధ వార్డుల కౌన్సిలర్లు తమ వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా సదరు పనులకు మున్సిపాలీటీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రస్థాయి నాయకుడి పలుకుబడితో స్పెషల్ ఫండ్స్తో నిర్మిస్తున్నారని తెలిపారు.