డార్విన్ : రెండు దశాబ్దాల తర్వాత (23 ఏండ్లు) ఆస్ట్రేలియాలో టెస్టు ఆడేందుకు వెళ్లిన బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది.హేమాహేమీలతో కూడిన ఆసీస్ను సొంతగడ్డపై ఓడించి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. ‘అసలు మీరు మూడు రోజులైనా ఆడతారా?’ అని కంగారూ మీడియా గేలి చేసినా వారికి గెలుపుతోనే దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చింది. డార్విన్ వేదికగా నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో బంగ్లా.. ప్రత్యర్థిపై 9 వికెట్ల తేడాతో నెగ్గి తమ క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్లో కామెరూన్ గ్రీన్ (104) సెంచరీతో ఆదుకున్నా ఆస్ట్రేలియాను 284 రన్స్కే కట్టడిచేసిన పర్యాటక జట్టు.. కంగారూలను తమ ఎదుట నిలిపిన 57 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మెహిదీ హసన్ మిరాజ్ (5/66) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో బంగ్లాకు ఇదే తొలి విజయం కాగా ఓవరాల్గా రెండోది. ఈ మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టిన బంగ్లా యువ పేసర్ హసన్ మహ్మద్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓవర్ నైట్ స్కోరు 161/4తో నాలుగో రోజు ఆరంభించిన ఆసీస్కు తొలి సెషన్లోనే మిరాజ్ చుక్కలు చూపించాడు. మొదట కేరీ (30)ని బుట్టలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వెబ్స్టర్ (5)నూ బౌల్డ్ చేశాడు. అదే ఊపులో కెప్టెన్ పాట్ కమిన్స్ (8)నూ బోల్తా కొట్టించి కంగారూలు కోలుకోకుండా చేశాడు. మరో ఎండ్లో గ్రీన్ పోరాడుతున్నా అతడికి సాయమందించేవారు కరువయ్యారు. స్టార్క్ (18) కొంతసేపు ప్రతిఘటించినా లంచ్ తర్వాత టస్కిన్ అతడికి చెక్ పెట్టాడు. గ్రీన్ శతకం చేశాక హసన్ ఓవర్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. లియాన్ (15)ను ఔట్ చేసిన మిరాజ్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
1 ఆస్ట్రేలియా గడ్డపై అతి తక్కువ మ్యాచ్ల్లోనే గెలిచి తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ 3మ్యాచుల్లో) నిలిచింది. పాకిస్థాన్ (7), భారత్ (12) ముందున్నాయి. శ్రీలంక (15) ఇంతవరకూ ఒక్క టెస్టులోనూ గెలవలేదు.
భారత్ మినహా ఆసియా జట్ల చేతిలో ఓడిపోవడం ఆసీస్కు 1995 తర్వాత ఇదే మొదటిసారి.