మక్తల్, ఆగస్టు 16 : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వడ్వాటు, అడవి సత్యారం శివారు వాగుల్లో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాగనూర్ మండలం నుంచి నారాయణపేట వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు, పర్మిట్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రవాణాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎస్సై అక్కడికి వచ్చి వాహనాలను పరిశీలించి అనుమతున్న వాహనాలను వదిలిపెట్టారు.