నల్లగొండ, మార్చి 15 : వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక తగ్గుదల కనిపిస్తున్నది. గతేడాది జిల్లాలో సగటు భూగర్భ జలాల నీటి లభ్యత 5.47 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 6.12 మీటర్ల లోతులోకి వెళ్లాయి. నెల రోజులుగా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 నుంచి 37 డిగ్రీలుగా నమోదు కావడమే కారణమని భూగర్భ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కృష్ణా, గోదావరి నీరు నిత్యం పారుతున్న నల్లగొండలో గడిచిన ఏడెనిమిదేండ్లుగా భూగర్భ జలాల్లో పెరుగుదలే కానీ తగ్గుదల కనిపించ లేదు. కాగా ఈ సారి మొదటిసారిగా పాక్షిక తగ్గుదల కనిపిస్తున్నది. అయినా ఇప్పటికీ రెండు మీటర్లలోపే జిల్లాలో భూగర్భ జలాలు అందు బాటులో ఉన్నాయి. ఫిబ్రవరిలోనే 37 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు చేరుకుంటమే నాటికి ఏ మేరకు పెరుగుతాయో ఆ ప్రభావం భూగర్భ జలాలపై ఏ విధంగా ఉంటుందనే ఆలోచనలు.
భూగర్భ జలాల్లో పాక్షిక క్షీణత..
ప్రతి ఏడాది వేసవి వచ్చిందంటే భూగర్భ జలాల్లో గణనీయమైన క్షీణత కనిపిస్తుంది. అయితే 2015 నుంచి వేసవిలోనూ జిల్లాలోని నాగార్జునసాగర్ ద్వారా పలు కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుండడం, దానికి తోడు ప్రతి ఏటా సాధారణ కన్నా అధిక వర్షపాతం కురుస్తున్న నేపథ్యంలో ఏటికేడు భూగర్భ జలాల్లో పెరుగుదలే కానీ తగ్గుదల కనిపించలేదు. ఈసారి వేసవి ఫిబ్రవరిలో ఆరంభమై సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడి పాక్షిక క్షీణత ఏర్పడింది. ఫిబ్రవరి 23న 36 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా 27న 37 డిగ్రీలు నమోదైంది. ఇవే ఉష్ణోగ్రతలు పునరావృతం కావడం వల్ల ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడి జిల్లాలోని 25 మండలాల్లో గత ఏడాది మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి పాక్షిక క్షీణత కనిపించింది. జిల్లాల్లో గతేడాది జిల్లా సగటు భూగర్భ జలాల లభ్యత 5.47 మీటర్లు ఉండగా ఈసారి 6.12 మీటర్లకు పడిపోయాయి.
రెండు మీటర్లలోపే నీళ్లు..
గతంలో వేసవి ఆరంభంలోనే 10 నుంచి 15 మీటర్లలోపు ఉండే నీరు ఇప్పటికీ రెండు మీటర్లలోపే అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 32 మండలాలకు 5 మండలాల్లో ఐదు మీటర్లలోపే భూగర్భ జలాలు ఉండగా సగటు నీటి లభ్యత మాత్రం 6.2 మీటర్లుగా ఉంది. కనిష్టంగా దామరచర్లలో 1.87 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా గరిష్ఠంగా అడవిదేవులపల్లిలో 11.75 మీటర్ల లోతులో ఉన్నాయి.