నీలగిరి, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం తన చాంబర్లో సీఎంఆర్పై పౌరసరఫరాలు, ఎఫ్సీఐ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ పూర్తి చేయడానికి ఈ నెల 29 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.
రైస్ మిల్లర్లు మిల్లు వారీగా కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని సైతం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు, ఎఫ్సీఐ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ శ్రీనివాస్, ఎస్డబ్ల్యూసీ మేనేజర్ నరసింహ, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నల్లగొండ అధ్యక్షుడు నారాయణ, మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.