నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) ; సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు ప్రాంతంగా ముద్ర పడింది. వనరులు ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణాజలాల్లో నిక్కచ్చిగా నీటి వాటాను వినియోగిస్తూ రెండు పంటలకు సాగునీరు అందించడం మొదలైంది. మిషన్ కాకతీయతో చిన్ననీటి వనరులను పటిష్ట పర్చడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చాయి. రైతు బంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయం అందింది. 24 గంటల కరెంట్ సరఫరాతో ఏటికేడు సాగు విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 2014 వానకాలంలో వరిసాగు 4.44లక్షల ఎకరాల్లో ఉండగా ఈ ఏడాది వానకాలం 13.54లక్షల ఎకరాలకు చేరింది. నాడు 12.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ప్రస్తుతం 33.85లక్షల
మెట్రిక్ టన్నులకు పెరిగింది. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ ధాన్యాగారంగా మారింది. ఫలితంగా పల్లెల్లో ఆర్థిక వనరులు పెరిగాయి.
సమైక్య పాలనలో కరువు జిల్లాగా ముద్రపడిన నల్లగొండ జిల్లా రూపురేఖలు స్వరాష్ట్రంలో పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రం సాధించిన తొలి ఏడాది నుంచే నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణాజలాల్లోని నీటి వాటాను వినియోగిస్తూ రెండు పంటలకు సాగునీరు అందించడం ప్రారంభమైంది. ఆ తర్వాత కాళేశ్వరం జలాలు తోడయ్యాయి. అంతేకాకుండా 2018 నుంచి వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల కరెంటు సరఫరా మరింత పురోభివృద్ధికి బాటలు వేసింది. రైతన్నకు ధైర్యం కల్పిస్తూ పెట్టుబడి సాయం తోడైంది. ఇవన్నీ వెరసి వరి సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యాగారంగా మారింది.
4.44 లక్షల నుంచి 13.54 లక్షలకు పెరుగుదల
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండలో 305 శాతం వరి సాగు పెరిగితే, సాగైన ప్రతి గుంటకూ సాగునీరు అందడం విశేషం. 2014 నుంచి నేటి వరకు వరి సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అదనంగా 9.10 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2014 వానకాలంలో ఉమ్మడి జిల్లాలో వరిసాగు కేవలం 4.44 లక్షల ఎకరాల్లోనే జరిగింది. కాగా, ఈ ఏడాది వానకాలంలో ఉమ్మడి జిల్లాలో అది 13.54 లక్షల ఎకరాలకు పెరుగడం విశేషం. ప్రస్తుతం వరిసాగులో నల్లగొండ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా నలువైపులా సాగునీటి వనరులు విస్తృతంగా అందుబాటులోకి రావడంతోనే ఈ ఘనత సాధ్యమైందనడంలో సందేహం లేదు.
33.85 లక్షల టన్నుల ధాన్యం ..
2014 వానకాలంలో 12.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనాకు గానూ వచ్చీరానీ కరెంటుకు తోడు భూగర్భజలాలు సరిగా లేక 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే చేతికి వచ్చింది. ఇందులో స్థానిక అవసరాలకు పోను కేవలం 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ, నేడు గత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 13.54 లక్షల ఎకరాల్లో వరిసాగైతే ఒక్క గుంట కూడా ఎండకుండా చేతికొచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 33.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికి రాగా, అందులో స్థానిక అవసరాలు పోగా 12.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయడం విశేషం. ఇందుకు గానూ రైతులకు అందిన మద్దతు ధర అక్షరాల రూ.2,255 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమైంది.
సాగు విస్తీర్ణం రెట్టింపు
ఉమ్మడి జిల్లాలో ఈ పదేండ్ల కాలంలో సాగు నీటి వనరులు ఊహకందని రీతిలో పెరుగడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం లభిస్తుండడంతో పంటల సాగు విస్తీర్ణం ఊహించని రీతిలో పెరిగింది. పదేండ్లలో అన్ని పంటల సాగు రెట్టింపైంది. ఉమ్మడి జిల్లాలో 35.10 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2014లో అన్ని పంటలు కలిపి మొత్తం సాగు విస్తీర్ణం 13.12 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కానీ, ప్రస్తుతం అది రెట్టింపు దాటి 26.50 లక్షల ఎకరాలకు చేరుకోవడం గమనార్హం. ఇందులో ప్రధానంగా వరి సాగు విస్తర్ణమే 9.10 లక్షల ఎకరాలకు పెరిగింది. మిగతా అన్ని పంటలు కలిపి మరో 4 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టుతో పాటు ఏఎంఆర్పీ లోలెవల్, హైలెవల్ కాల్వలకు సాగు నీరు అందుబాటులోకి వచ్చింది. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, మూసీ ద్వారా అదనపు జలాలు, చెర్వులు, కుంటల ద్వారా భూగర్భజలాలు ఇలా అన్ని వైపులా సాగునీరు పుష్కలంగా లభిస్తున్నది. దాంతో సాగును వదిలి వెళ్లిన వారంతా తిరిగి వ్యవసాయంపై దృష్టి సారించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. ఏటికేడు పంటల సాగు, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతూ పోతుంది.