నోటిఫికేషన్ విడుదల : నవంబర్ 3
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : నవంబర్ 3
నామినేషన్లకు ఆఖరు : నవంబర్ 10
నామినేషన్ల స్క్రూటినీ : నవంబర్ 13
ఉపసంహరణకు ఆఖరు : నవంబర్ 15
పోలింగ్ : నవంబర్ 30
ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానున్నది. సరిగ్గా నెల రోజుల్లో డిసెంబర్3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. వచ్చే నెల 3 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 10 వరకు కొనసాగనున్నది. 30న పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14.26లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఉమ్మడి జిల్లా అంతటా సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో పకడ్బందీగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు ప్రకటించారు. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు నవంబర్ 1 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
2018 ఎన్నికలతో పోలిస్తే షెడ్యూల్ మూడ్రోజుల ఆలస్యమైనా పోలింగ్ మాత్రం వారం రోజుల ముందుగానే జరుగనుంది. షెడ్యూల్ ప్రకటన నుంచి పోలింగ్కు 51 రోజుల సమయం ఉన్నా.. నోటిఫికేషన్ నుంచి పోలింగ్కు సరిగ్గా 27 రోజులే గడువు ఇచ్చారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన అనంతరం సరిగ్గా 15వ రోజే పోలింగ్ జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతీ రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 13న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. ఇక అప్పటి నుంచి సరిగ్గా 15 రోజుల్లో అంటే నవంబర్ 30న రాష్ట్రంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడిస్తారు. డిసెంబర్ 5వ తేదీతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగినుంది.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924 మంది, మహిళలు 7,17,436 మంది, ట్రాన్స్జెండర్లు 120 మంది ఓటర్లుగా ఉన్నారు. సర్వీసు ఓటర్లుగా 540 మంది నమోదు చేసుకున్నారు. పురుషుల కంటే 8,512 మంది అధికంగా మహిళా ఓటర్లు ఉండడం విశేషం. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా.. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కాగా, 18-19 సంవత్సరాల యువత 48,909 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 80 ఏండ్లు పైబడిన ఓటర్లు 17,387 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 32,003, ఓవర్సీస్ ఓటర్లు 74 మంది ఉన్నారు. అయితే.. కొత్త ఓటర్ల నమోదుకు నవంబర్ 1వ తేదీ వరకు గడువు ఉన్నది.
నల్లగొండ జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గతంలో 1,747 ఉండగా 19 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో అర్బన్లో 356, గ్రామీణ ప్రాంతాల్లో 1,410 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రతి నియోజకవర్గానికి 5 చొప్పున మహిళా పోలింగ్ స్టేషన్లు, 5 చొప్పున మోడల్ స్టేషన్లు, ఒకటి చొప్పున వికలాంగుల స్టేషన్లు, ఒకటి చొప్పున యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 521 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా.. అందులో దేవరకొండలో 87, నాగార్జున సాగర్లో 77, మిర్యాలగూడలో 69, నల్లగొండలో 72, మునుగోడులో 112, నకిరేకల్ నియోజకవర్గంలో 104 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ కేంద్ర పోలీసు బలగాలతో అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక విషయంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే యంత్రాంగం ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపడుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు, కొత్తగా వాడనున్న వీవీ ప్యాట్ యంత్రాలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఓటు వేసిన తర్వాత గుర్తును ధ్రువీకరించుకునే వెసులుబాటు కలిగిన వీవీ ప్యాట్ల వినియోగంపై అధికారులతోపాటు ఓటర్లకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనావళికి అనుగుణంగా నడుచుకోవాల్సిందే. బహిరంగ సభలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాల కోసం ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. వీరితోపాటు వివిధ కమిటీలు రంగంలో ఉంటాయి. పార్టీలు లేదా అభ్యర్థుల ఖర్చుల వివరాలపై నిఘా కోసం పలు రకాల కమిటీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఖర్చుల మానిటరింగ్ కమిటీతోపాటు మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జడ్పీ సీఈఓ నేతృత్వంలో జిల్లా గ్రీవియన్స్ కమిటీ పనిచేయనుంది. సోమవారం నుంచి జిల్లాలో ఆయా కమిటీలు రంగంలోకి దిగాయి. చాలా చోట్ల గోడలపై పార్టీలు, నేతల వాల్ రైటింగ్స్ను తుడిచివేస్తూ, వాల్ పోస్టర్లను తొలగించే పని మొదలుపెట్టారు. దీంతోపాటు నేతల విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. నేటి నుంచి కట్టుదిట్టంగా మరిన్ని చర్యలకు సిద్ధ్దమవుతున్నారు.