రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్నా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్వరాష్ట్రంలో ఏటేటా అభివృద్ది పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ది, సంక్షేమంలో ప్రగతిమార్గంలో గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా ముందుకు సాగుతున్నది. అందుకు మంగళవారం రాష్ట్ర ప్రణాళిక విభాగం విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక(అట్లాస్-2022)నే నిదర్శనం. వ్యవసాయంలో పాటు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పన లాంటి అంశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయతో చేపట్టిన పనులతో భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పైకొచ్చాయి. ఇక సాగు విస్తీర్ణంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి పంటల సాగు చేరుకుంది.
వరి పంట సాగులో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువగా పత్తి సాగులో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇక మాంసం ఉత్పత్తుల్లోనూ వృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్నది. చేపలు ఉత్పత్తిలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానం లభించింది. వ్యవసాయ వృద్ధితో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇక ఫ్లోరైడ్కు పర్యాయపదంగా మారిన జిల్లాలో మిషన్ భగీరథతో వందశాతం ఆవాసాలకు సురక్షిత తాగునీరు అందుతున్నది. పలు అంశాల వారీగా విడుదల చేసిన గణాంకాల్లో జిల్లా తనదైన శైలిలో ప్రగతిని ప్రదర్శిస్తున్నది. సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనాదక్షతతోనే ఇవన్నీ సాధ్యమన్న అభిప్రాయం కాదనలేని వాస్తవం.
– నల్లగొండ ప్రతినిధి, జనవరి25 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జనవరి25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రణాళిక విభాగం 2021-22 సంవత్సరానికి సంబంధించి గణాంక వివరాలను అట్లాస్-2022 పేరుతో విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి, ప్రస్తుత పరిస్థితిని అంశాల వారీగా లెక్కల్లో ఇందులో పొందుపరించింది. జాతీయ స్థాయిలో రాష్ట్రం పరిస్థితి, రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఇందులో వివరాలను వెల్లడించింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. పంటల సాగు, ఉత్పత్తితో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిలోనూ మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లలో, రైతుబంధు, రైతుబీమాల ద్వారా లబ్ధిలోనూ తొలిస్థానంలో నిలుస్తుంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల వారీగా లెక్కలను విడివిడిగా పొందుపర్చారు.
వ్యవసాయంలో అగ్రస్థానం
స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల పటిష్టతోపాటు ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి పథకాలతో వ్యవసాయంలో జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. 2021-22 వానకాలం, యాసంగిల్లోనూ వరి సాగులో సూర్యాపేట జిల్లానే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నల్లగొండ రెండో స్థానంలో నిలువగా యాదాద్రి జిల్లా 8వ స్థానానికి ఎగబాకింది. కాళేశ్వరం ద్వారా గోదావరి జిలాలు రావడంతో సూర్యాపేటలో ఎకరం కూడా ఖాళీ ఉండడం లేదు. భూవిస్తీర్ణంలో తక్కువే అయినా సాగులో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. 2021-22 వానకాలంలో సూర్యాపేట జిల్లాలో 4.69 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 9.38 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. రెండోస్థానంలో నల్లగొండ జిల్లా 4.62 లక్షల ఎకరాలకు గానూ 9.64లక్షల మెట్రిక్ టన్నులు, యాదాద్రిలో 2.79 లక్షల ఎకరాల్లో 5.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో 8వ స్థానంలో నిలిచింది.
యాసంగిలోనూ సూర్యాపేట జిల్లా 4.37లక్షల ఎకరాల సాగుతో 9.07 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడితో రాష్ట్రంలోనే తొలిస్థానం సాధించింది. రెండోస్థానంలో నల్లగొండ జిల్లా 4.33 లక్షల ఎకరాల్లో సాగుతో 8.95లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించింది. 10వ స్థానంలో యాదాద్రి జిల్లా 1.41లక్షల ఎకరాలతో 4.21 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధించింది. దాంతోపాటు పత్తి సాగులో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 6.53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. సూర్యాపేటలో 98వేల ఎకరాలు, యాదాద్రిలో 1.25లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2020-21తో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు తగ్గి వరి సాగు పెరిగినట్లు స్పష్టం అవుతుంది. ఇక బత్తాయి సాగులోనూ నల్లగొండ జిల్లా 43,673 ఎకరాల సాగుతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లలోనూ…
ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకంలో నల్లగొండ జిల్లాకు భారీ లబ్ధి చేకూరుతుంది. నల్లగొండ జిల్లాలో 1.56లక్షల వ్యవసాయ కనెక్షన్లతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో మొత్తం 1.02లక్షల వ్యవసాయ కనెక్షన్లు, సూర్యాపేట జిల్లాలో మొత్తం 55వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా కూడా గణనీయంగా పంటల సాగు జరుగుతున్నది. గతంలో అత్యధిక బోరుబావులున్న జిల్లాగా ఉన్న నల్లగొండలోనే కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. నేడు స్వరాష్ట్రంలో వాటన్నింటికీ చెక్ పెడుతూ నిరాటకంగా ఉచిత కరెంట్ అందుతున్నది.
రైతుబంధు ప్రయోజనం అత్యధికం
రైతుబంధు పథకం లబ్ధిలో ఆది నుంచి నల్లగొండ జిల్లాదే అగ్రస్థానం. 2022 వానాకాలంలో నల్లగొండ జిల్లాలో 4.83 లక్షల మంది రైతులకు 603 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2.67లక్షల మందికి 310 కోట్లు, యాదాద్రి జిల్లాలో 2.34 లక్షల మంది రైతులకు గానూ 293.77 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఇది ప్రతియేటా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. 2021 వానాకాలంతో పోలిస్తే 50వేల మందికి పైగా రైతులకు అదనంగా రైతుబంధు లబ్ధి చేకూరింది. ఇక రైతుబీమా విషయంలోనూ నల్లగొండ జిల్లాలో 5673 మందికి, సూర్యాపేటలో 2989, యాదాద్రి జిల్లాలో 2474మంది రైతు కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది.
రికార్డు స్థాయికి భూగర్భజలాలు
2016 సంవత్సరం నుంచి 2022 నాటికి సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల పటిష్టత, సకాలంలో వర్షాలతో రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరిగాయి. ఒకనాడు కరువు జిల్లాగా ఉండే ఉమ్మడి జిల్లాలో భారీగా భూగర్భజలాల నీటిమట్టం నమోదైంది. 2022 నడివేసవి మే మాసాన్ని ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో కేవలం 6.73 మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. 2016 మే నెలతో పోలిస్తే అదనంగా 9.41 మీటర్ల పైన జలాలు ఉండడం విశేషం. ఇక సూర్యాపేట జిల్లాలో 5.91 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నాయి. 2016 మేతో పోలిస్తే ఇక్కడ 8.95మీటర్లు పైకి భూగర్భజలాలు వచ్చాయి. ఇక యాదాద్రి జిల్లా 7.39 మీటర్లు మేర పైకి ఎగబాకాయి. ఇక్కడ కూడా ఏడేండ్లలో 9.68మీటర్లకు పైకి జలాలు తన్నుకువచ్చాయి. దీంతో గత కొన్నేండ్లుగా ఉమ్మడి జిల్లాలో బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చినైట్లెంది.
మాంసం ఉత్పత్తుల్లో..
ప్రభుత్వ చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కావచ్చు… చేప పిల్లల ఉచిత పంపిణీ పథకం కావచ్చు… ఉమ్మడి జిల్లాలో మాంసం ఉత్పత్తులు కూడాగణనీయంగా పెరిగాయి. నల్లగొండ జిల్లాలో 2020-21లో 25,389 టన్నుల చేపలు ఉత్పత్తి, 2021-22లో 29,450 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. ఇక సూర్యాపేట జిల్లాలో కిందటి ఏడాది 16402 టన్నులు కాగా 2021-22లో 19554 టన్నులు, యాదాద్రి జిల్లాలోనూ కిందటి ఏడాది 9,652 టన్నులు కాగా 2021-22లో 13,675 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది.
పెరిగిన స్కూల్ విద్యార్థులు
పాఠశాల విద్యలో కిందటి ఏడాదితో పోలిస్తే అదనంగా ఈ ఏడాది 25వేల మంది విద్యార్ధులు పెరిగారు. నల్లగొండ జిల్లాలో కిందటి ఏడాది 2.34లక్షల మంది విద్యార్థులు ఉండగా 2020-21లో 2.43లక్షల మంది నమోదయ్యారు. సూర్యాపేట జిల్లాలో కిందటి ఏడాది 1.36లక్షల మందికి గానూ 2020-21లో 1.43లక్షల మంది, యాదాద్రి జిల్లాలో కిందటి ఏడాది 1.03లక్షల మందికి గానూ 2020-21లో 1.12లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్యలో నమోదయ్యారు.
పెరిగిన ఆసరా పెన్షన్లు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కీలకమైన ఆసరా పెన్షన్లు కూడాగణనీయంగా పెరిగాయి. 2020-21తో పోలిస్తే 2021-22లో అదనంగా 68వేల మందికి ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి. నల్లగొండ జిల్లాలో కిందటి ఏడాది 1.85లక్షల ఆసరా పెన్షన్లు ఉంటే 2021-22లో 2.17లక్షలకు పెరిగాయి. సూర్యాపేట జిల్లాలో 1.35లక్షలకు గానూ 1.56లక్షలకు, యాదాద్రి జిల్లాలో 92వేలకు గానూ 2021-22లో 1.07లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.
తలసరి ఆదాయంలో..
2020-21 సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం(పర్ క్యాపిటా ఇన్కం)ను పరిశీలిస్తే ప్రస్తుత రేట్ల ప్రకారం నల్లగొండ జిల్లాలో 2.04లక్షలు, సూర్యాపేట జిల్లాలో 1.75లక్షలు, యాదాద్రి జిల్లాలో 2.07లక్షలుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా జీడీపీని ప్రస్తుత రేట్ల ప్రకారం పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో 38,927 కోట్లుతో రాష్ట్రంలో 5వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 22524కోట్లతో 11వ స్థానంలో, యాదాద్రి జిల్లా 18651 కోట్లుతో 14వ స్థానంలో నమోదైంది. కిందటి ఏడాదితో పోలిస్తే మంచి వృద్ధిని కనపరిచాయి.
రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో అత్యధిక సాగు విస్తీర్ణంలోనూ ఉమ్మడి జిల్లాదే అగ్రస్థానం. అది కూడా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేనంత కావడం విశేషం. 2021-22 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి మొత్తం 22.24 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగే కావడం విశేషం. ఇతర అని రకాలు కలిపి 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు విషయంలో సూర్యాపేట జిల్లా 9.07లక్షల ఎకరాలతో అగ్రస్థానంలో నిలువగా రెండో స్థానంలో నల్లగొండ జిల్లా 8.95 లక్షల ఎకరాలతో రెండోస్థానంలో, 4.21 లక్షల ఎకరాలతో యాదాద్రి జిల్లాలో 8వ స్థానంలో నిలిస్తుంది. ఇక మూడు జిల్లాలో కలిపి వరి ధాన్యం దిగుబడి 44.60లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో 2014-15లో ఉమ్మడి జిల్లా అంతటా కలిపి 13లక్షల ఎకరాల్లోనే అన్ని రకాల పంటలు సాగయ్యాయి. పంటల సాగుతో పాటు వ్వవసాయంపై ఆధారపడి జీవనం సాగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తున్నది.
పారిశ్రామికరంగంలో..
2021-22 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రంగంలోనూ భారీగా వృద్ధి కనిపిస్తున్నది. ప్రభుత్వం టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. మల్కాపూర్ లాంటి పారిశ్రామిక పార్కులతో అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 414 ఫ్యాక్టరీలు ఉండగా 24740 మంది వర్కర్లు, 30721 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిల్లో రూ.8882 కోట్ల ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలో 176 ఫ్యాక్టరీలు ఉండగా వీటిల్లో 3,288 మంది కార్మికులు, 3913 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 560కోట్లు ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉంది. యాదాద్రి జిల్లాలో 330 ఫ్యాక్టరీలు ఉండగా వీటిల్లో 10559 మంది కార్మికులు, 12525 మంది ఉద్యోగులు ఉన్నారు. 3124కోట్ల రూపాయల ఫిక్స్డ్ క్యాపిటల్ వీటిల్లో నమోదై ఉంది.