చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన పల్లె రవికుమార్ను సీఎం కేసీఆర్ తెలంగాణ గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఉద్యమకారుడికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రవికుమార్ జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
– చండూరు, మే 4
చండూర్, మే 4 : రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
పల్లె రవికుమార్ గౌడ్ నేపథ్యం :
స్వగ్రామం – బొడంగిపర్తి, మండలం చండూరు, మునుగోడు నియోజకవర్గం జిల్లా నల్లగొండ
పుట్టిన తేదీ – 02-04-1972
తండ్రి పేరు – పల్లె లింగయ్య, మాజీ సర్పంచ్, సీపీఐ, బొడంగిపర్తి
భార్య – పల్లె కళ్యాణి గౌడ్, ఎంపీపీ, చండూరు
అర్హతలు – బీఎస్సీ, ఎంసీజే(జర్నలిజం)
కమ్యూనిస్ట్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పల్లె రవికుమార్ విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లొరైడ్ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు
1996లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో జర్నలిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు
2000-06 వరకు వార్త దిన పత్రికలో స్టేట్ బ్యూరోలో పని చేశారు
2006- 11 వరకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీనియర్ కరస్పాడెంట్(రాజకీయ అంశాలు) గా విధులు నిర్వర్తించారు
2006లో చండూరు వేదికగా వేలాది మందితో భారీ బహిరంగ సభను తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బలంగా వినిపించారు. ఈ వేదిక సాక్షిగా ఫ్లొరైడ్ రక్కసిపై పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై తన వాణిని వినిపించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని జర్నలిస్ట్లను ఏకతాటిపై తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.టీయూడబ్ల్యూజే 143 వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్గా ఉన్నారు
మునుగోడు నియోజకర్గంలోని శివన్నగూడెం ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించారు
ప్రస్తుతం ’తెలంగాణ జర్నలిస్టుల ఫోరం’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ’పీపుల్స్ ఫౌండేషన్’ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.