నిడమనూరు, మార్చి 31 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో 13 గ్రామపంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల పక్షపాతిగా పనిచేస్తున్న బీఆర్ఎస్ అణిచివేతకు కుట్ర చేస్తున్న బీజేపీ కుహానా రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కి అధికారం కోసం అర్రులు చాస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్తోపాటు టోల్ ధరలను పెంచి సామాన్యులను పీడిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు.
గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలు ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ఒకరంటే ఒకరికి గిట్టని, ఎప్పుడూ కలువని కాంగ్రెస్ పార్టీ నాయకులు హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో నటిస్తున్న తీరును ప్రజలు నమ్మరన్నారు. 65లక్షల సభ్యత్వాలు కలిగిన అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని, అంబేద్కర్ కలలు గన్న రాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని చెప్పారు. ఎమ్మెల్యే నోముల భగత్ ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి మంజూరైన నిధుల్లో సగం కూడా గతంలో దశాబ్దాలుగా మంజూరు కాలేదన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే అధికారం వస్తుందని, అధికారం లేకుంటే ఎవరూ పట్టించుకోరని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ర్టాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ శ్రమించాలని కోరారు.
మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలె : ఎమ్మెల్యే భగత్కుమార్
నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని 2014కు ముందు ఏండ్లపాటు ఏలినోళ్లు రోడ్డు మీద తట్టెడు మట్టి పోయలేదని, ఒక్క కాలేజీ తీసుకురాలేదని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. తలాపున కృష్ణా నది పారుతున్నా చివరి భూములకు సాగు నీరియ్యని ప్రతిపక్ష నాయకులు.. ఇప్పుడు అధికారం కోసం ప్రభుత్వంపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గంలోని చివరి భూములకు సాగు నీరందిందని, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు జరిగిందని చెప్పారు. చేసిన మేలు మరువకుండా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను మరో మారు గెలిపించి మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందామని సూచించారు. సాగర్ను 30 ఏండ్లు ఏలిన జానారెడ్డి హయాంలో సాగు నీరు, విద్యుత్, సీసీ రోడ్ల సౌకర్యం ఎందుకు కల్పించలేదో నిలదీయాలని ప్రజలకు సూచించారు.
పచ్చగా ఉన్న తెలంగాణపై కక్షపూరితంగా విషం చిమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని, సేవకుడిలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్రెడ్డి, నిడమనూరు, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, నాయకులు నూకల వెంకట్రెడ్డి, కామర్ల జానయ్య, కట్టెబోయిన గుర్వయ్యయాదవ్, బొల్లం రవియాదవ్, మెరుగు రామలింగయ్య, సత్యనారాయణరెడ్డి, మధుబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.