వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బీదలు. నిలువ నీడలేని, సొంత గూడుకు నోచనివారు. కానీ, సర్కారు కరుణతో ఒక్కసారిగా ఓ ఇంటి వారయ్యారు. పట్టణానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు పడక గదులతో కూడిన ఇంటికి ఓనర్లు అయ్యారు. గృహప్రవేశానికి శుభసూచికంగా పాలు పొంగించి పండుగ చేసుకున్నారు. ఇంటిల్లిపాది బంధుమిత్రులతో కలిసి సంతోషం పంచుకున్నారు. ఈ సంబురానికి నార్కట్పల్లి మండలం నక్కలపల్లి వేదికగా నిలిచింది. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యఅతిథులుగా హాజరై ఇక్కడి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. సొంతింటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్, ఇండ్ల నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసి ఇచ్చిన జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్ సల్లంగుండాలె అని దీవెనలు అందించారు. మళ్లీ సారే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా రూ.560 కోట్లతో 8,855 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పట్టణాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తికాగా, గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల లబ్ధిదారులకు అప్పగించడం కూడా పూర్తయ్యింది. మిగతా చోట్ల వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ) : నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఊరికి అనుకుని ఉన్న స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీ ఊరికే ప్రత్యేక ఆకర్షణగా మారింది. గ్రామంలోని సర్వే నెంబర్ 266లో రెండు ఎకరాల భూమిని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తన తల్లిదండ్రులు బండా చంద్రారెడ్డి-పిచ్చమ్మ జ్ఞాపకార్థం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇందులోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు. తన స్వగ్రామం కావడంతో నరేందర్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం రూ.5.03కోట్లతో 80 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంపూర్ణ సహకారం తోడైంది. ఐదు బ్లాకులుగా నిర్మాణాలు ప్రారంభించి తొలి దశలో జీ ప్లస్ వన్ మోడల్లో 64 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరో 8 ఇండ్లు తుది దశలో ఉండగా, ఇంకో 8 ఇండ్ల నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది.
నిర్మాణం పూర్తయిన ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా చేపట్టారు. రాజకీయాలకు, పక్షపాతాలకు తావు లేకుండా ఇండ్లు లేని నిజమైన నిరుపేదలకు స్థానం కలిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రకారంగానే లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపుల సమయంలోనూ డ్రాలో వినూత్నంగా వ్యవహరించారు. అనుమానాలకు తావివ్వకుండా లబ్ధిదారులతోనే డ్రా చిట్టీని తీయించి ఇండ్ల కేటాయింపును పూర్తి చేశారు. ఆ ప్రకారంగానే పట్టాలను సిద్ధం చేసి బుధవారం పంపిణీ చేశారు. స్థానికుడు, స్థలదాత జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులందరికీ స్వయంగా పట్టాలు అందజేశారు. తర్వాత ప్రతి ఇంటికీ తిరిగి పాలు పొంగిస్తున్న లబ్ధిదారులతో కలిసి ఆనందం పంచుకున్నారు. డబుల్ బెడ్ రూం కాలనీలో విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో మారుమూల గ్రామానికి కొత్త శోభ తోడై పట్టణాల్లోని కాలనీని తలపిస్తుండడం విశేషం.
గ్రామంలో పండుగ వాతావరణం
పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగానే లబ్ధిదారులంతా సామూహిక గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆహ్వానించారు. పట్టాలు చేతికందగానే అదే సంతోషంతో ముహూర్తం ప్రకారం ఎవరింట్లో వాళ్లు పాలు పొంగించారు. కొందరు పాయసం వండి అక్కడున్న వారందరికీ పంచిపెట్టారు. సొంతింట్లోకి కూరాడు కుండలతో తరలొచ్చి బోనం పుదించారు. కొందరు అయ్యవార్లతో పూజలు చేయించారు. మరికొందరు తమ సామాన్లను కొత్తింట్లోకి తరలిస్తూ కనిపించారు. ఏ ఇంట్లోకి తొంగి చూసినా సందడే సందడి కనిపించింది. ఒకేసారి 64 మంది గృహ ప్రవేశం చేసేసరికి ఊరంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.
లబ్ధిదారుల
గృహ ప్రవేశాలు చేస్తున్న ఏ లబ్ధిదారుడిని పలుకరించినా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎవరిచ్చారు ఈ ఇల్లు అంటే.. ఇంకెవరు పేదల దేవుడు కేసీఆర్ సారు అంటూ స్పందించారు. ఇంతకు ముందు ఇలాంటి ఇండ్లు ఎప్పుడైనా చూశారా అంటే.. ఎక్కడా లేవని బదులిచ్చారు. అందరికీ ఏం కావాలో అర్సుకుని అన్నీ ఇచ్చేది కేసీఆర్ సారే. ఆయనతోనే ఈ ఇల్లోచ్చింది. ఆయన సల్లగుండాలి.. మళ్లా ఆ సారే రావాలంటూ స్వీపర్గా పనిచేసే శ్రీపతి పిచ్చమ్మ చెప్పింది. మా ఊరి నరేందర్ పటేల్ భూమిచ్చిండు.. అందులో ఇండ్లు కట్టించిండ్రని చెప్పుకొచ్చింది. ఈ ఇల్లు విలువెంతో తెలుసా అని జిల్లా ఆండాలును పలుకరిస్తే పది లచ్చలు పెట్టినా ఇంత పెద్ద ఇల్లు ఏడోస్తది అని చెప్పింది.
కేసీఆర్ సార్ ఇండ్లు కట్టియ్యమని చెప్పితే.. మా నరేందర్ సార్, ఎమ్మెల్యే లింగన్న దగ్గరుండి అన్నీ చేసిండ్రని చెప్పుకొచ్చింది. పైసా కర్సు లేకుండా పట్టాలు చేతిలో పెట్టారని సంతోషం వ్యక్తం చేసింది. ప్లంబర్ పని చేసే భాషపాక లక్ష్మయ్య భార్య సంధ్యను పలుకరిస్తే.. ‘నా భర్త ఇండ్లల్లో బండలేసుడు, టైల్స్ వేసుడు పనులు సేస్తడు.. కానీ సొంతిల్లు కట్టుకునే పైసలు లేవు. కేసీఆర్ సార్ పుణ్యాన ఇంత పెద్ద ఇల్లు వచ్చింది. కలలో కూడా అనుకోలే అసలు. కేసీఆర్ సార్కు, మా ఊరు నరేందర్ సార్, ఎమ్మెల్యే సార్కు, అందరికీ రుణపడి ఉంటాం. పేదోళ్లకు ఇంతకంటే ఎక్కువ ఎవరు చేస్తారు. మళ్లోసారి కేసీఆర్ సర్కారే రావాలి’ అంటూ ఆశీర్వదించింది. ఇలా నక్కలపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందాలు ప్రస్ఫుటమయ్యాయి.
రూ.560కోట్లతో జిల్లాలో 8,855 ఇండ్లు..
నల్లగొండ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. ఇప్పటికే పట్టణాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. మిగతా చోట్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో రూ.560 కోట్లతో మొత్తం 8,855 డబుల్ బెడ్ రూం ఇండ్లను చేపట్టారు. ఇందులో మున్సిపాలిటీల పరిధిలో 1,680 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 6,475 ఇండ్లు ఉన్నాయి. మున్సిపాలిటీలకు కేటాయించిన ఇండ్లన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిల్లో మౌళిక వసతుల కల్పన తుది దశలో ఉండగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఇండ్లల్లో ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 6, మైనార్టీలకు 12శాతం, మిగతా ఇండ్లను జనరల్ వారికి కేటాయించనున్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ.5.03లక్షలు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌళిక వసతుల కల్పన కోసం మరో 1.30లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. మొత్తం రూ.6.33లక్షలను కేటాయిస్తోంది. గ్రామీణ ప్రాంతాలైన నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి, బి.వెల్లెంల, నక్కలపల్లి, మిర్యాలగూడ మండలం కొత్తగూడెం, కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామాల్లో, తిప్పర్తి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లో జీ+1 తరహాలో ఇండ్ల నిర్మాణం చేపట్టగా మిగతా గ్రామాల్లో ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇండ్ల నిర్మాణంతోపాటు రోడ్లు, తాగునీటి వసతి, కరెంటు సౌకర్యం వంటి అన్ని వసతులను కల్పిస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించగా, మిగతా చోట్ల వీలైనంత త్వరగా అప్పగించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్
నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద మా గ్రామంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి సొంత డబ్బుతో రెండెకరాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషకరం. ఇంతకుముందు మా అత్త ఇంట్లో మూడు కుటుంబాలు ఉమ్మడిగా ఉండి ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు సొంత ఇల్లు రావడంతో మా కుటుంబమంతా ఆనందంగా ఉన్నది. మాకు సొంత ఇల్లు కల్పించిందుకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డికి కృతజ్ఞతలు.
– భాషపాక సంధ్య, నక్కలపల్లి గ్రామం
జన్మలో ఇల్లు కట్టుకోలేకపోదును
మాకు సరైన ఇల్లు లేదు. భూమి లేదు. కూలినాలి చేసుకొని బతుకు సాగిస్తున్నం. మాకు సొంత గూడులేక ఎన్నో అవస్థలు పడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తారని ఎన్నో సార్లు ఇక్కడా అక్కడా విన్నాం. మా గ్రామానికి దేవుడిలా వచ్చిన బండా నరేందర్రెడ్డి సారు గ్రామసభ ద్వారా మాకు ఇల్లు వస్తుందని చెప్పారు. డ్రా తీసి ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఎంతో సంతోషపడ్డాం. సీఎం కేసీఆర్, నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే లింగయ్య సార్లకు రుణపడి ఉంటాం.
– జిల్లా ఆండాలు,నక్కలపల్లి గ్రామం