భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 20 : వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పొట్టేటి మరియదాస్, అతడి తమ్ముడు శాంతయ్య బతుకుదెరువు కోసం వలిగొండ మండలం సంగెం గ్రామానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన కర్నె లక్ష్మితో మరియదాస్కు పరిచయం ఏర్పడింది. లక్ష్మి భర్త చనిపోగా మరియదాస్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. రెండు కుటుంబాల పోషణ భారమై మరియదాస్ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 2019లో భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో 14 గొర్రెలు, 2023లో తుర్కపల్లి, భువనగిరిలో దొంగతనాలు చేశాడు. ఆ తర్వాత మరియదాస్ తన సోదరుడు శాంతయ్య, లక్ష్మి, అమ్మనబోలుకు చెందిన బాణాల రాజేశ్ ముఠాగా ఏర్పడి 2023నుంచి జిల్లాలోని ఆత్మకూరు(ఎం), ఆలేరు, మోత్కూరు, యాదగిరిగుట్ట, భువనగిరి, మోటకొండూరు పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఈ క్రమంలో డీసీపీ పర్యవేక్షణలో కొద్ది రోజులుగా పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆలేరు మండలం జీడికల్ క్రాస్ రోడ్డు వద్ద యాదగిరిగుట్ట సీఐ కొండల్రావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాలను అంగీకరించారు. వారి నుంచి 41తులాల బంగారం, రెండు కిలోల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులను సీపీ తరుణ్జోషి అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంంలో డీసీపీ రాజేశ్చంద్ర, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రమేశ్కుమార్, సీఐ కొండల్రావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.