నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నది. వాస్తవంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగమే స్వరాష్ట్రంలో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నది. అత్యధికంగా బో ర్లపై ఆధారపడి వ్యవసాయం సాగించే జిల్లా రైతుల ఉచిత విద్యుత్ ఎంతో భరోసానిచ్చింది. దాంతో పాటు రైతు బంధు ప్రయోజనం కూడా అత్యధికంగా ఉమ్మడి జిల్లా రైతులకు చెందుతున్నది. ఇక వీటితో పాటు ప్రతీ యేటా అత్యధికంగా పండుతున్న ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లతోనూ జిల్లా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. వ్యవసాయరంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అత్యధిక ప్రయోజనం ఉమ్మడి జిల్లా రైతాంగానికే చెందుతుంది.
సమైఖ్య పాలనలో ఆగమైన వ్యవసాయం ఓ వైపు సాగునీరు, మరోవైపు సాగు ప్రోత్సహాక పథకాలతో గాడిలో పడి లాభదాయకంగా మారుతుంది. సాగుభూమి కూడా ఎనిదేండ్లల్లో 13 లక్షల ఎకరాల నుంచి 21 లక్షల ఎకరాల పైచిలుకు పెరిగింది. భూమి ఉన్న ప్రతీ రైతు వ్యవసాయం వైపు దృష్టి సారించాడనడంలో సం దేహం లేదు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభు త్వ విధానాలు అటంకంగా మారుతున్నాయి. గత యాసంగిలో దొడ్డు రకం ధాన్యాన్ని కొన బోమంటూ కేంద్ర మోకాలడ్డితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాడింది. కేంద్రం దిగి రాకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి అండగా నిలిచింది. మరోవైపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితేనే కేంద్ర నుంచి నిధులు విడుదల చేస్తామన్నా కూడా తెలంగాణ సర్కార్ ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేశారు.
కల్లాల నిర్మాణంపై కేంద్రం కత్తి
తాజాగా ఉపాధిహామీ నిధులతో వ్యవసాయరంగంలో చేపట్టిన పలు పథకా లపైనా మోదీ సర్కార్ కన్నుపడింది. ఓ వైపు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం రంగానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ కేంద్రం తీరు మరోలా ఉంది. పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడే రైతు కల్లాల నిర్మాణంపై కేంద్రం కత్తికట్టింది. రైతు కల్లాల నిర్మాణంలో ఉపాధి హామీ నిధులను ఎలా ఉపయోగిస్తారంటూ ఆంక్షలు పెట్టింది. అందుకు సంబంధించిన రూ. 750 కోట్ల పైచిలుకు నిధులను ఆపడంతో పాటు ఇప్పటికే చెల్లించిన రూ.151 కోట్ల నిధులు తిరిగి చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఇక వీటితో పాటు రైతువేదిక నిర్మాణాలపైనా అక్కస్సు వెళ్లగక్కుతూ ఉపాధి హామీ నిధుల వినియోగంపై కొర్రీలు పెడుతున్నది. ఇలా అనేక విధాలుగా రైతులపై మోదీ సర్కార్ కుట్రలు చేస్తుండడంతో మరో సారి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోరాటానికి పిలుపునిచ్చారు. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు మహాధర్నాలు నిర్వహించాలని, పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి పార్టీలోని అన్ని స్థాయి ల్లో నేతలు మహాధర్నాలో కదం తొక్కాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లో…
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు దృష్టి సారించారు. నల్లగొండలోని క్లాక్టవర్ సెంటర్లో, సూర్యాపేటలోని వాణిజ్యభవన్ సెంటర్లో, భువనగిరిలోని ప్రిన్స్కార్నర్ సెంటర్లో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. మహాధర్నాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి వరకు రైతుబంధు సమితి సభ్యులు, పార్టీలోని అన్ని స్థాయిల్లోని నేతలు పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. వీరం తా జిల్లాల నలుమూలల నుంచి పెద్దసంఖ్య లో రైతులను భాగస్వాములు చేస్తూ మహాధర్నాకు తరలిరావాలని ఆదేశించింది. సూర్యాపేట ధర్నా లో మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అనంతరం నల్లగొండ ధర్నాలోనూ మంత్రి పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. కేంద్రం వ్యతిరేక విధానాలపై పోరాటానికి రైతులంతా కలిసి రావాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేర కు నేడు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు, పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.