నల్లగొండ, డిసెంబర్ 12 : వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది. మొత్తం 61,972 మంది రైతులకు గానూ 53,853 మంది రైతుల ఖాతాలో రూ.693 కోట్లు జమ చేసింది. మొత్తం 53 234 దాన్యం కేంద్రాల ద్వారా ఈ కొనుగోల్లు జరిగాయి. ఈ సారి గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందస్తుగానే 96.27లక్షల బ్యాగులు తెప్పించగా ఇంకా 13.14లక్షలు అందుబాటులో ఉన్నాయి.
రైతులు పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను పెంచి కొనుగోలు చేస్తున్నది. గత వానకాలంలో క్వింటాకు రూ.1960 ఉండగా ఈ సారి దానిని రూ.2060కి పెంచిన సర్కారు సాధారణ రకానికి రూ.1940 నుంచి రూ.2060కి పెంచింది. అయితే రైతులు పచ్చి ధాన్యం తీసుకొని రాకుండా ఆరబెట్టి తీసుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. 17శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్నే అధికారులు కొనుగోలు చేస్తున్నారు.
మూడు రోజుల్లోనే డబ్బులు జమ
రైతులు ధాన్యం అమ్మిన రెండు మూడు రోజుల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా సివిల్ సైప్లె శాఖ చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు రూ.777 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా అందులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బిల్లింగ్ పూర్తి అయిన 24 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నట్లు సివిల్ సైప్లె అధికారులు పేర్కొంటున్నారు. ఇక ప్రతి ఏటా ప్రతి సీజన్లో ఆయా శాఖల నుంచి సుమారు 15వేల మంది సిబ్బంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో మహిళా సంఘాల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ సారి కూడా 118 కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్విరామంగా రైతులకు సేవలు అందిస్తున్నారు.
ప్రతి గింజా కొనుగోలు చేసేలా చర్యలు
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నిబంధనలు పాటిస్తూ రైతులకు మద్దతు ధర అందించటంతో పాటు డబ్బులు సైతం ఎప్పటికప్పుడే వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు కొనుగోళ్లు చేపడుతున్నారు. సివిల్ సైప్లె శాఖ, గ్రామీణాభివృద్ధి సహకార, వ్యవసాయ శాఖ వంటి మొత్తంగా పది శాఖల యంత్రాంగం సమన్వయం చేసుకొని కొనుగోళ్లు చేపడుతున్నది.
118 మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు
వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం అక్టోబర్ 22 నుంచి కొనుగోలు ప్రారంభించాం. ఇప్పటి వరకు ఐకేపీ ద్వారా 118 కేంద్రాలు ప్రారంభించి వాటి ద్వారా 1.42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అన్ని శాఖల ద్వారా రూ.777 కోట్ల విలువైన 3,77,170 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. డీఆర్డీఏ ద్వారా 118 మహిళా సంఘాలకు సంబంధించి సభ్యులు కొనుగోలు కేంద్రాల్లో భాగస్వామలై రైతుల నుంచి సేకరిస్తున్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే డబ్బులు కూడా ఎప్పటికప్పుడే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
-కాళిందిని, డీఆర్డీఓ, నల్లగొండ