నల్లగొండ, ఏప్రిల్ 1 : అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల నోడల్ అధికారులతో ఆమె సమీక్షించారు. ఫారం-12డీ అందజేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోస్ట్ ద్వారా వేసే ఓటు కాదని, ప్రత్యేకంగా ఏర్పా టు చేసే ఫెసిలిటేషన్ కేంద్రాలకు ఉద్యోగి స్వయంగా వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనే ఉద్యోగుల వివరాలన్నీ ఎక్సెల్ షీట్లో పొందుపరచాలని జిల్లా నోడల్ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓడీ రాజ్యలక్ష్మి, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారిని వి.శ్రీదేవి పాల్గొన్నారు.
లోక సభ ఎన్నికల సందర్భంగా మీడి యా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ద్వారా నిర్దేశించిన సమయంలో రాజకీయ ప్రకటనలకు అనుమతులను ఇవ్వాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని ఆదేశించారు. లోక సభ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలను పరిశీలించాలని, అనుమతులు సకాలంలో ఇవ్వాలని సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు.