రైతన్న వెన్నంటి రాష్ట్ర సర్కారు
నకిలీ, నాసిరకం విత్తనాల కట్టడి
విత్తన దుకాణాల్లో విస్తృతంగా టాస్క్ఫోర్స్ బృందాల తనిఖీలు
సాగు పనుల్లో నిమగ్నమైన రైతులు
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 19: తొలకరి వానలతో రైతాంగం సాగుకు సిద్ధమైన వేళ మార్కెట్లో నకిలీ, నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నది. సర్కారు ఆదేశాల మేరకు వ్యవసాయ, విజిలెన్స్, పోలీస్ శాఖ అధికారులతో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ సీజన్లో జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందన్న వ్యవసాయ శాఖ అంచనా నేపథ్యంలో రైతులు మోసపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మోటకొండూరు మండలం సికిందర్నగర్లో నిషేధిత పత్తి విత్తనాలను పట్టుకుని, వాటిని విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. చౌటుప్పల్లో నాసిరకం విత్తనాలు అమ్ముతున్న డీలర్పైనా కేసు పెట్టారు. నకిలీ విత్తనాల తయారీ, విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
పలు దుకాణాల్లో దాడులు.. కేసులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్నగర్లో ఒక వ్యక్తి షాపులో కాకుండా తన ఇంటి వద్ద విడిగా పత్తి విత్తనాలు విక్రయాలు చేస్తున్నాడనే సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. 90 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన అమరేశ్ అనే వ్యక్తి వద్ద 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అలాగే చౌటుప్పల్లో నాణ్యత లేని వరి విత్తనాలు అమ్ముతున్న డీలర్పై కేసు నమోదు చేశారు. గత సంవత్సరం ఆలేరు, భువనగిరి, బీబీనగర్ మండలాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతుండగా పట్టుకొని కేసులు నమోదు చేశారు.
ఇతర రాష్ర్టాల నుంచి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ వానకాలంలో 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. ఇతర రాష్ర్టాల నుంచి ఇప్పటికే కొందరు రైతులు పత్తి విత్తనాలను తెచ్చుకున్నారు. దళారులు నకిలీ విత్తనాలను తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.
నకిలీ విత్తనాలు అమ్మకుండా చర్యలు
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు, పోలీస్ శాఖతో కలిసి టాస్క్పోర్స్ బృందం ఏర్పాటు చేశాం. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో సర్టిఫైడ్ పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100 లేదా వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఈ దాడులు నిరంతరం కొనసాగిస్తాం.
– అనూరాధ, జిల్లా వ్యవసాయాధికారి, యాదాద్రి భువనగిరి