నల్లగొండ ప్రతినిధి, ఏఫ్రిల్17(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలు కానుంది. గురువారం ఉదయం 11గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ తదుపరి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ పనిదినాల్లో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలు చేయవచ్చు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా వెల్లడించనున్నారు. ఇక వచ్చే నెల 13న పోలింగ్ జరుగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అభ్యర్థుల తుది జాబితా అనంతరం సరిగ్గా 12 రోజుల గడువే ప్రచారానికి మిగిలి ఉండనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల దాఖలు కానున్నాయి.
నల్లగొండకు సంబంధించి నల్లగొండ కలెక్టరేట్లో, భువనగిరికి సంబంధించి భువనగిరి కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండు జిల్లా కలెక్టర్లు ఆయా నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
నేటి నుంచి మొదలవనున్న నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సెంట్రల్ ఫోర్స్, అర్డ్ ఫోర్స్, సివిల్ బలగాలు విధుల్లో ఉంటాయని వెల్లడించారు. ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల లోపలకి అభ్యర్థితోపాటు మరో నలుగురికి, మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.