పరీక్ష ఫలితాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అమల్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లోనే ఆన్లైన్ ఈ-వాల్యూయేషన్ ఉండగా, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అమలుచేస్తూ నిర్ణయం తీసుకున్నది. దాంతో పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను తప్పుల్లేకుండా పారదర్శకంగా మూల్యాంకనం చేసే అవకాశం ఏర్పడింది. ఆయా సబ్జెక్టుల మూల్యాంకనం విధులకు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చే అధ్యాపకులకూ ఊరట కలిగింది. ఫలితాలు సత్వరమే వెలువడడమే గాక రీవాల్యూయేషన్ సకాలంలో పూర్తి కానున్నది. మరోవైపు యూనివర్సిటీలో కిందిస్థాయి సిబ్బంది నుంచి వీసీ వరకు అందే ఫైల్స్ను పరిష్కరించేందుకు అంతర్గతంగా ఈ-ఆఫీస్ను ఏర్పాటుచేసి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. యూనివర్సిటీలో జరుగాల్సిన పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి.
రామగిరి, ఆగస్టు 25 : ఆధునిక కాలానికి అనుగుణంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వీసీ చోల్లేటి గోపాల్రెడ్డి యూనివర్సిటీ సేవలను విస్తరిస్తున్నారు. ఎంజీయూ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సులను నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఇతర యూనివర్సిటీలకు దీటుగా ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చారు. అదే విధంగా పలు ఫైళ్లను ‘ఈ-ఆఫీసు’లో పరిష్కరించేలా ఏర్పాటు చేశారు. దీని ద్వారా కిందిస్థాయి సిబ్బంది నుంచి వీసీ వరకు ఆన్లైన్లోనే పరిష్కరించే అవకాశం ఉంటుంది.
అన్ని కోర్సుల జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్లోనే
సమయం, శ్రమ తగ్గించేలా ఎంజీయూలో ఈ-వాల్యూయేషన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే పీజీ కోర్సులతోపాటు ఎంఈడీ కోర్సుల్లో ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రస్తుతం ముగిసిన డిగ్రీ కోర్సుల్లో అమలు చేశారు. వీటితోపాటు బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీకి జరిగే పరీక్షలకు కూడా ఇదే పద్ధతిని కొనసాగించనున్నారు. మూల్యాంకనంలో ప్రతి పదిమంది అధ్యాపకులు చేసే ఆన్లైన్ మూల్యాంకనాన్ని పరిశీలించే విధంగా చీఫ్ ఎగ్జామినర్స్ను నియమించనున్నారు. ఆన్లైన్ మాల్యాంకనానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఫైల్స్ పరిశీలనకు ఈ-ఆఫీసు
ఎంజీయూలో పలు విభాగాలకు వచ్చే సమస్యలు, ఫైల్స్ను త్వరగా పరిష్కరించేందుకు ‘ఈ-ఆఫీసు’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్గంగా ఈ విధానం అమలుకు ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేశారు. త్వరలోనే యూనివర్సిటీలో విజయవంతం చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలల్లోనూ ప్రవేశ పెట్టనున్నారు.
పారదర్శకత కోసమే..
పరీక్షల జవాబు పత్రాలు పారదర్శకంగా ఉండేలా ఈ-వాల్యుయేషన్స్ను అమలు చేస్తున్నాం. ఎక్కడా తప్పుల లేకుండా ఉండేందుకు, బాధ్యతాయుతంగా ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది. అంతేగాక యూనివర్సిటీకి కొంత భారం తగ్గుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అందరి సహకారం, సూచనలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం.
– చొల్లేటి గోపాల్రెడ్డి, వీసీ, ఎంజీయూ
ఈ-వాల్యూయేషన్ను స్వాగతిస్తున్నాం
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్లైన్ మూల్యాంకనాన్ని స్వాగతిస్తున్నాం. దీని వల్ల అధ్యాపకుడికి యూనివర్సిటీకి వెళ్లే శ్రమ తగ్గుతుంది. అంతేకాకుండా కళాశాలలోనే తీరిక సమయంలో మూల్యాంకనం చేసుకోవచ్చు. పారదర్శకంగా మూల్యాంకనం జరుగడమే కాకుండా ఫలితాలు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
– మారం నాగేందర్రెడ్డి,
ప్రిన్సిపాల్, నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నల్లగొండ