బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న నకిరేకల్,
నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సభల కోసం ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభాస్థలం చదునుతోపాటు ఇతర పనులు పూర్తి కావచ్చాయి. మరోవైపు సభకు పార్టీ నేతలు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. సభకు వచ్చే వారికి ఇబ్బందులులేకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్17(నమస్తే తెలంగాణ) : ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థ్ధులకు మద్దతుగా ప్రసంగిస్తూ మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భువవనరి, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండల్లో తొలి విడుతలోనే సీఎం కేసీఆర్ పర్యటించారు. మలి విడుతలో ఈ నెల14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఇవి కాకుండా నకిరేకల్, నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న మధ్యాహ్నం నకిరేకల్, సాయంత్రం నల్లగొండలో జరుగనున్న ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొనేలా కేసీఆర్ పర్యటన ఖరారైంది.
కేసీఆర్ రాక కోసం నకిరేకల్, నల్లగొండలో మ్మెల్యే అభ్యర్థ్ధులు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభాస్థలాలను ఎంపిక చేసి చదును చేశారు. ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు. నకిరేకల్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సభ కోసం పట్టణంలోని మూసీ రోడ్డులో విశాలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలోని సభా ఏర్పాట్లను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాష్ట్ర నేత చెరుకు సుధాకర్, నలగాని ప్రసన్నరాజ్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక నల్లగొండలో నిర్వహించే సభ కోసం మర్రిగూడ బైపాస్ రోడ్డులోని విశాలమై స్థలాన్ని ఎంపిక చేశారు.
2018 ఎన్నికల సమయంలోనూ ఇదే స్థలంలో కేసీఆర్ సభలు నిర్వహించారు. అదేస్థలం అందరికీ అనువుగా ఉంటుందని మరోసారి అందులోనే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, రాష్ట్ర నేతలు చాడ కిషన్రెడ్డి, చకిలం అనిల్కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు వచ్చే వాహనాలకు అవసరమైన పార్కింగ్ స్థలాలను సిద్ధ్దం చేస్తున్నారు. సభా వేదికతో పాటు వీఐపీ, మహిళా, మీడియా… ఇలా ప్రత్యేకంగా భారీకేడ్లతో గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో రెండు నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సారధ్యంలో అమలవుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను సభలకు ఆహ్వానిస్తున్నారు. ఆయా పథకాల లబ్ధిదారులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఆవాసం నుంచి ప్రజలు తరలివచ్చేలా నేతలు చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఈ సభా వేదికలపై నుంచి ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు.
సాధించుకున్న రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిందేమీటి? ఇంకా చేయాల్సింది ఏమిటీ? కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రలు ఏంటీ? ఈ పరిస్థితుల్లో ప్రజల ముందున్న కర్తవ్యం ఏమిటీ? ఇలా అనేక విషయాలపై కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు. అదేవిధంగా నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధ్దితో పాటు ఇంకా మిగిలి ఉన్న పనులపై కూడా కేసీఆర్ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నేతలు కూడా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు విస్తృత ప్రచారం కల్పించి, జనం తరలివచ్చేలా పనుల్లో నిమగ్నమయ్యారు.