నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : భారత సమాఖ్యలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం విలీనమైన విషయం తెలిసిందే. ఆనాటి పోరాటాన్ని కొన్ని శక్తులు మతం పేరుతో, కులం పేరుతో తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నాయి. వాటన్నింటినీ తిప్పికొడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆనాటి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా రూపుదిద్దుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ విలీన దినోత్సవం రోజున ఆదివారం అంతటా సమైక్యత దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరుపాలని ఆదేశాలిచ్చారు. గత ఏడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మూడ్రోజులపాటు ర్యాలీలు నిర్వహించడంతోపాటు వాడవాడలా జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమైక్యత వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 9గంటలకు నల్లగొండ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేట పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, యాదాద్రి జిల్లా పరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
అనంతరం గౌరవ వందనం స్వీకరించి, సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట అమరవీరులకు నివాళులు అర్పించి ఆనాటి పోరాట వీరులను సన్మానించనున్నారు. అంతకుముందే అన్ని జిల్లాల కలెక్టరేట్లతోపాటు ఎస్పీ కార్యాలయాలు, ఇతర అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాలను ఎగురవేసి సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. వీటిల్లో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు. మరోవైపు సమైక్యత వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లోని పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా నేడు సమైక్యత వేడుకలకు సర్వం సిద్ధమైంది.